Viral news: ఇదేం పెళ్లిరా బాబూ.. తుపాకీ ఎక్కుపెట్టి.. తాళి కట్టించి..!

ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఇటీవలే ఉద్యోగం సాధించిన యువకుడిని ఓ వ్యక్తి కిడ్నాప్‌ చేసి.. బలవంతంగా తన కూతురి మెడలో తాళి కట్టించాడు.

Published : 01 Dec 2023 18:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రేమ, పెద్దలు కుదిర్చిన వివాహాల గురించి వినే ఉంటారు. కానీ, యువకుడిని కిడ్నాప్‌ చేసి.. అతడితో బలవంతంగా తాళి కట్టించడం గురించి ఎప్పుడైనా విన్నారా? నిజమే. బిహార్‌లోని (Bihar) వైశాలి (Vaishali) జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఇటీవలే బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (BPSC) పరీక్షలో అర్హత సాధించి ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరిన ఓ యువకుడిని కొందరితో కలిసి ఓ వ్యక్తి కిడ్నాప్‌ చేశాడు. దూరంగా తీసుకెళ్లి.. పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో గన్‌ పెట్టి.. బలవంతంగా తన కూతురి మెడలో తాళి కట్టించాడు. బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలను పోలీసులు తాజాగా వెల్లడించారు.

గౌతమ్‌ కుమార్‌ అనే యువకుడు ఇటీవలే వైశాలి జిల్లాలోని ఉత్క్రమిత్‌ మధ్య విద్యాలయలో ఉపాధ్యాయుడిగా చేరారు. బుధవారం మధ్యాహ్నం కారులో కొందరు వ్యక్తులు వచ్చి.. అతడిని బలవంతంగా కారులోకి ఎక్కించుకొని వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. రాజేశ్‌ రాయ్‌ అనే వ్యక్తే తమ కుమారుడిని కిడ్నాప్‌ చేశాడని ఆరోపించారు. గతంలో తన కుమార్తె చాందినిని వివాహం చేసుకోవాల్సిందిగా రాజేశ్‌ కోరాడని, అయితే, గౌతమ్‌ అందుకు తిరస్కరించడంతో అతడిపై భౌతిక దాడి కూడా చేశారని పోలీసులకు వివరించారు. అయినా, లొంగకపోడంతో కిడ్నాప్ చేసి,  తన కూతుర్నిచ్చి బలవంతంగా వివాహం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు రాజేశ్‌ రాయ్‌ ఇంటి వెళ్లి కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించారు. తొలుత తమకేం తెలియదని చెప్పారు. వాళ్ల మాటలకు అనుమానం వచ్చిన పోలీసులు సోదాలు నిర్వహించగా అసలు విషయం బయటపడింది.

అప్పటికే గౌతమ్‌, చాందినిల వివాహం పూర్తి చేసిన రాజేశ్.. నూతన దంపతుల్ని తన ఇంట్లోనే బంధించాడు. పోలీసులు కలగజేసుకొని గౌతమ్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. తుపాకీ ఎక్కుపెట్టి.. తనతో బలవంతంగా తాళి కట్టించారని పోలీసుల ఎదుట గౌతమ్‌ వాపోయారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ తరహా వివాహాలను బిహార్‌లో ‘పకడ్వా వివాహ్‌’ అని పిలుస్తారు. అక్కడ ఇలాంటివి జరగడం ఇదేం మొదటిసారి కాదు. గతేడాది తమ కుక్క పిల్లకు బాగోలేదంటూ ఓ వెటర్నరీ డాక్టర్‌ను ఇంటికి పిలిపించిన ఓ వ్యక్తి.. బలవంతంగా తన కూతుర్ని అతడికి ఇచ్చి పెళ్లి చేశాడు. కొన్నేళ్ల కిందట కూడా ఇదే తరహా ఘటన చోటు చేసుకోవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బొకారో ఉక్కు కర్మాగారంలో ఇంజినీర్‌గా చేరిన ఓ యువకుడిని కిడ్నాప్‌ చేసి..ఓ యువతితో వివాహం జరిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు