Supreme Court: నన్ను బెదిరించొద్దు.. నా కోర్టు నుంచి వెళ్లిపోండి

సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌(ఎస్‌సీబీఏ) అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

Updated : 03 Mar 2023 17:54 IST

సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిపై సీజేఐ మండిపాటు
న్యాయవాదుల ఛాంబర్ల కోసం భూమి కేటాయింపు వ్యవహారంపై తీవ్ర వాగ్వాదం

దిల్లీ: సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌(ఎస్‌సీబీఏ) అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. న్యాయవాదుల ఛాంబర్ల కోసం భూమి కేటాయింపు వ్యవహారాన్ని త్వరగా లిస్ట్‌ చేయాలని వికాస్‌ సింగ్‌ ప్రస్తావించడం ఇందుకు కారణమైంది. ‘‘స్వరం పెంచి నన్ను బెదిరించొద్దు. ఈ కోర్టు నుంచి బయటకు వెళ్లిపోండి’’ అంటూ వికాస్‌ సింగ్‌పై సీజేఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదుల ఛాంబర్ల కోసం భూమి కేటాయించడానికి సంబంధించిన అంశాన్ని వికాస్‌ సింగ్‌ గురువారం ఉదయం జస్టిస్‌ చంద్రచూడ్‌ ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. ఆ పిటిషన్‌ విచారణకు వచ్చేలా చూసేందుకు తాను 6 నెలలుగా కష్టపడుతున్నానని చెప్పారు.

‘‘ఎస్‌సీబీఏ వేసిన పిటిషన్‌ కారణంగానే అప్పూఘర్‌ భూమి సర్వోన్నత న్యాయస్థానానికి దక్కింది. అందులోని కొంత భాగాన్ని మాత్రమే అయిష్టంగా బార్‌ అసోసియేషన్‌కు ఇచ్చారు. జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలోనే ఆ భూమిలో నిర్మాణం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. ఈ పిటిషన్‌ విచారణకు వచ్చేలా చూసేందుకు మేము 6 నెలలుగా కష్టపడుతున్నాం. నన్ను ఒక సాధారణ కక్షిదారుడిగానే పరిగణించండి’’ అని వికాస్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై సీజేఐ తీవ్రంగా స్పందించారు. ‘‘కేసును విచారించాలని మీరు ఇలా డిమాండ్‌ చేయకూడదు. మేము రోజంతా ఖాళీగా కూర్చుంటున్నామని మీరు అంటున్నారా?’’ అని ప్రశ్నించారు.

‘‘అలా నేను అనడం లేదు. కేసును విచారణకు చేపట్టేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నా. అలా కుదరకపోతే.. మీ ఇంటికే రావాల్సి ఉంటుంది’’ అని అన్నారు. వికాస్‌ వ్యాఖ్యలతో జస్టిస్‌ చంద్రచూడ్‌ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ‘‘ప్రధాన న్యాయమూర్తిని బెదిరించొద్దు. దయచేసి కూర్చోండి. కేసును విచారణకు కోరే పద్ధతి ఇది కాదు. 22 ఏళ్ల నా సర్వీసులో నేను ఎవ్వరి బెదిరింపులకూ లొంగలేదు. చివరి రెండేళ్లలోనూ ఆ పరిస్థితి రానివ్వను. మీ బెదిరింపులతో నన్ను భయపెట్టలేరు. నా కోర్టు నుంచి బయటకు వెళ్లండి’’ అని స్పష్టం చేశారు.

‘‘మిస్టర్‌ వికాస్‌ సింగ్‌.. స్వరం పెంచొద్దు. మీరు చర్చ స్థాయిని తగ్గిస్తున్నారు. మీ పిటిషన్‌పై ఈ నెల 17న విచారణ జరుగుతుందని ఇప్పటికే చెప్పా. మీరు ఒత్తిడి చేసినంత మాత్రాన ఇది తొలి కేసుగా ఉండదు’’అని సీజేఐ మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఓ కేసు కోసం కోర్టుకు వచ్చిన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌.. సీజేఐ-వికాస్‌ సింగ్‌ వాగ్వాదంపై స్పందించారు. ‘‘ఈ ఉదయం జరిగిన దానికి క్షమాపణలు చెబుతున్నా. ఎవరూ లక్ష్మణ రేఖను దాటకూడదు. కోర్టు హుందాతనం పరిమితుల్ని బార్‌ అసోసియేషన్‌ దాటకుండా ఉండాల్సింది’’ అని సీజేఐ దగ్గర విచారం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని