National Herald Case: నేషనల్‌ హెరాల్డ్‌ కేసు.. సోనియా, రాహుల్‌ గాంధీకి మళ్లీ ఈడీ సమన్లు?

కాంగ్రెస్‌కు చెందిన యంగ్‌ ఇండియా కంపెనీలో అనుమానాస్పద లావాదేవీలను ఈడీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. వీటి గురించి ప్రశ్నించేందుకు కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీకి మళ్లీ సమన్లు జారీ చేసే అవకాశముంది.

Published : 07 Nov 2022 10:22 IST

దిల్లీ: నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు మళ్లీ విచారించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ కేసులో ఆ మధ్య వీరిద్దరినీ ఈడీ అధికారులు కొన్ని రోజులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత చేపట్టిన దర్యాప్తులో కాంగ్రెస్‌కు చెందిన ‘యంగ్‌ ఇండియా’ సంస్థకు కొన్ని అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

షెల్‌ కంపెనీల ద్వారా యంగ్‌ ఇండియా కంపెనీకి రూ.4-5 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. వీటి గురించి ఇప్పటికే ఈడీ అధికారులు ఆ షెల్ కంపెనీల యజమానుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. దీనిపై ప్రశ్నించేందుకు సోనియా, రాహుల్‌కు త్వరలోనే  సమన్లు జారీ చేయాలని ఈడీ అధికారులు యోచిస్తున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. వీరితో పాటు కాంగ్రెస్‌ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, సీనియర్‌ నేత పవన్‌ బన్సల్‌ తదితరులకు ఈ సమన్లు అందే అవకాశమున్నట్లు తెలుస్తోంది. యంగ్‌ ఇండియా కంపెనీలో రాహుల్‌, సోనియా గాంధీకి మెజార్టీ వాటాలున్నాయి.

ఇదీ చదవండి: నేషనల్‌ హెరాల్డ్‌... ఇదీ అసలు వివాదం!

నేషనల్‌ హెరాల్డ్‌ కేసు విచారణలో భాగంగా ఈ ఏడాది జూన్‌లో ఈడీ అధికారులు రాహుల్‌ గాంధీని ఐదు రోజుల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సోనియా గాంధీ కూడా మూడు రోజులు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే యంగ్‌ ఇండియా కార్యాలయంలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు.

బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా భారతీయుల వాణిని వినిపించేందుకు 1938లో అప్పటి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జవహర్‌లాల్‌ నెహ్రూ ‘నేషనల్‌ హెరాల్డ్‌’ పత్రికను ప్రారంభించారు. అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌(ఏజేఎల్‌) సంస్థ ఆధ్వర్యంలో పత్రిక నిర్వహణ కొనసాగింది. అయితే నేషనల్ హెరాల్డ్‌ ఆస్తుల్ని సోనియా, రాహుల్‌ ఆయాచితంగా పొందారంటూ భాజపా ఎంపీ సుబ్రమణ్య స్వామి గతంలోనే ఫిర్యాదు చేయగా దీనిపై కేసు నమోదైంది. కాంగ్రెస్‌కు నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియన్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. దీనిపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని