ప్రభుత్వాధికారులకు విద్యుత్‌ వాహనాలు?

అన్ని ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలకు విద్యుత్‌తో నడిచే వాహనాలను అందచేయాలనే అంశం పరిశీలనలో

Published : 19 Feb 2021 17:33 IST

దిల్లీ: దేశంలో అన్ని ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలకు విద్యుత్‌తో నడిచే వాహనాలను అందచేయాలనే అంశం పరిశీలనలో ఉన్నట్టు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వం వంట గ్యాస్‌కు రాయితీ ఇస్తున్న మాదిరిగానే.. విద్యుత్‌తో పనిచేసే వంట పరికరాలకు సబ్సిడీ ఇవ్వటం సముచితమని ఆయన అభిప్రాయపడ్డారు. దీనివల్ల గ్యాస్‌పై ఆధారపడటం తగ్గుతుందన్నారు.

విద్యుత్‌తో నడిచే పరికరాల వినియోగానికి ప్రోత్సాహమిచ్చే ‘గో ఎలక్ట్రిక్‌’ ప్రచార కార్యక్రమాన్ని మంత్రి నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్‌ వాహనాల వాడకాన్ని ఇప్పటికే తప్పనిసరి చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు రాజధాని దిల్లీలో పది వేల విద్యుత్‌ వాహనాలను వాడటం మొదలుపెడితే.. ఒక నెలకు రూ.30 కోట్లు ఆదా అవుతుందని గడ్కరీ వెల్లడించారు.
తమ శాఖలో కార్యాలయాలకు విద్యుత్ వాహనాలు అందచేయాలనుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఆలోచనను పరిశీలించాల్సిందిగా విద్యుత్‌ మంత్రి ఆర్‌.కే సింగ్‌కు గడ్కరీ విజ్ఞప్తి చేశారు. అంతేకాకుంగా విద్యుత్‌ బస్‌ సర్వీసులను దిల్లీ నుంచి ఆగ్రా, జైపూర్‌లకు త్వరలోనే ప్రారంభించనున్నామని మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ సందర్భంగా ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని