ఆరోజు ట్రంప్‌ చెప్పింది అబద్ధమా..?

ఇరాక్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై జరిపిన క్షిపణి దాడిలో 34 మంది సైనికుల ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమైనట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. జనవరి 8న అల్‌ అసద్‌ స్థావరంపై.........

Updated : 25 Jan 2020 11:20 IST

ఇరాన్‌ ప్రతీకార దాడిలో అమెరికా సైనికులకు తీవ్రగాయాలు

వాషింగ్టన్‌: ఇరాక్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై జరిపిన క్షిపణి దాడిలో 34 మంది సైనికుల ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమైనట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. జనవరి 8న అల్‌ అసద్‌ స్థావరంపై ఇరాన్‌ జరిపిన ప్రతీకార దాడి వల్ల సైనికులకు మెదడు సంబంధిత సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ అధికారికంగా ప్రకటించింది. దాడి అనంతరం అక్కడి నుంచి బలగాల్ని జర్మనీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిని ప్రస్తుతం అమెరికాకు తీసుకెళ్లినట్లు వెల్లడించారు. 

ఈ విషయం ముందుగానే బయటికి పొక్కడంతో అధ్యక్షుడు ట్రంప్‌ని మీడియా వివరణ కోరింది. సైనికులకు పెద్ద ప్రమాదమేమీ లేదని.. ‘కేవలం తలనొప్పి’ అంటూ ఆయన తేలిగ్గా కొట్టిపారేయడం గమనార్హం. ‘‘నేను గతంలో చూసిన గాయాలతో పోలిస్తే ఇవి అంత పెద్దవేమీ కాదు’’ అని వ్యాఖ్యానించారు.

దాడి జరిగిన మరుసటి రోజు అమెరికా సైనికులకు ఎటువంటి గాయాలు కాలేదని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. గాయాలైన సమాచారం ఆలస్యంగా వెలుగులోకి రావడంపై పెంటగాన్‌ వివరణ ఇచ్చింది. పూర్తి వైద్య పరీక్షల అనంతరం నివేదికలతో సహా సమాచారం అంచెలంచెలుగా ఉన్నతాధికారులకు చేరడానికి సమయం పట్టిందని వివరించింది. అలాగే మెదడు సంబంధిత వ్యాధుల్లో పూర్తి స్థాయి లక్షణాలు బయటకు రావడానికి సమయం పడుతుందని తెలిపింది. 

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ గాయాల్ని ‘ట్రమాటిక్‌ బ్రెయిన్‌ ఇంజ్యురీస్‌’గా వ్యవహరిస్తున్నారు. క్షిపణి పేలుడు వల్ల వాతావరణ పీడనంలో మార్పులు సంభవించి ఈ తరహా సమస్యలు తలెత్తుతాయని వైద్యులు తెలిపారు.

ఇరాన్‌ అగ్రశ్రేణి కమాండర్‌ జనరల్‌ ఖాసీం సులేమానీని అమెరికా డ్రోన్‌ దాడితో చంపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణులతో విరుచుకుపడింది. అయితే ఆ సమయంలో సైనికులెవరూ స్థావరంలో లేకపోవడంతో వారెవరికీ ఏమీ కాలేదని అప్పట్లో అమెరికా ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని