హెచ్చరించినా పట్టించుకోనిపైలట్‌..

పాకిస్థాన్‌లోని కరాచీలో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే

Published : 26 May 2020 01:51 IST

పాక్‌ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని కరాచీలో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. లాహోర్‌ నుంచి ప్రయాణికులతో బయలుదేరిన విమానం కరాచీకి దగ్గర్లో కూలిపోయింది. అయితే ఆ ప్రమాదానికి ముందు పైలట్‌ను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) విభాగం మూడు సార్లు హెచ్చరించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ నివేదిక ద్వారా వెల్లడవుతుంది. విమానం ఉన్న ఎత్తు, ల్యాండ్ అయ్యే ముందు దాని వేగం గురించి ఏటీసీ చేసిన హెచ్చరికలను అతడు పట్టించుకోలేదని తెలుస్తుంది. 

కరాచీకి 15 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు విమానం 10 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుందని, వెంటనే 7,000 అడుగుల పరిధిలోకి తీసుకురావాలని అధికారులు మొదటి సారి పైలట్‌ను హెచ్చరించారని పాకిస్థాన్‌ సివిల్ ఏవియేషన్ అథారిటీ తయారు చేసిన ప్రాథమిక నివేదిక వెల్లడించింది. ఎత్తు తగ్గించకపోగా, సాఫీగానే ఉందని పైలట్ వారికి చెప్పారని తెలిపింది. కరాచీకి 10 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు కూడా ఎత్తును తగ్గించాలంటూ ఇదేవిధమైన హెచ్చరిక చేసినా అతడు పట్టించుకోలేదని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. అప్పుడు కూడా తాను చూసుకోగలని చెప్పినట్లు వారు పేర్కొన్నారు. కరాచీలో మొదటి సారి విమానం దించాలనుకున్నప్పుడు, కుదుపులకు లోనై, రన్‌వే కొద్ది మేర పాడైనట్లు వెల్లడించారు. దాంతో కొద్ది మేర మంటలు చెలరేగాయిని, అప్పుడే ఆయిల్ ట్యాంక్, పైప్‌ లీక్ అయ్యుండొచ్చని వారు అభిప్రాయడ్డారు. అప్పుడు విమానాన్ని 3000 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లమని చెప్పినా, అతడు మాత్రం 1800 అడుగుల వద్దే ఉంచాడని చెప్పారు. అయితే ఆ ఎత్తుకు రాకపోవడానికి ఇంజిన్‌లో సమస్య కూడా కారణం కావొచ్చన్నారు. ఆ తరవాత విమానం ఒక్కసారిగా కూలిపోయి ఉంటుందన్నారు. 

కరోనా నేపథ్యంలో ఆంక్షలను సడలిస్తూ దేశీయంగా విమాన రాకపోకలకు పాకిస్థాన్ ప్రభుత్వం మే 16న అనుమతిచ్చింది. ఈ ప్రమాదం జరగడంతో మళ్లీ ఆ అనుమతులను వెనక్కి తీసుకుంది. ఘటన జరిగినప్పుడు విమానంలో ఉన్న 91 మంది ప్రయాణికులు, ఎనిమిదిమంది సిబ్బందిలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని