ఆ దృశ్యాన్ని చూసి సిగ్గుపడాలి: కపిల్ సిబల్

తల్లి మరణించిందని తెలియక, అమ్మను లేపేందుకు ఓ చిన్నారి చేసిన ప్రయత్నాలు ఓ వీడియో ద్వారా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Published : 28 May 2020 23:31 IST

ముజఫర్‌పుర్: బిహార్‌లోని ముజఫర్‌పుర్‌ రైల్వే ఫ్లాట్‌ఫారంపై మరణించిన తల్లిని..చిన్నారి తట్టి లేపుతూ..ఆమెపై కప్పి ఉంచిన దుప్పటిని లాగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఆ హృదయవిదారక దృశ్యం చూపరులను కన్నీరు పెట్టించింది. ఇప్పుడు దానిపై కాంగ్రెస్‌ నేత కపిల్ సిబల్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నందుకు మనమంతా సిగ్గుతో తలలు దించుకోవాలని ప్రభుత్వంపై మండిపడ్డారు. 
‘వలస కార్మికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చాల్సిన బాధ్యత మనది కాదా? శ్రామిక రైళ్లలో ఆహారం, నీళ్లు, సరైన టాయిలెట్లు లేవు. పైగా బోగీలన్నీ కిక్కిరిసి ఉంటున్నాయి. ఈ క్రమంలో తల్లులు పిల్లలను కోల్పోతున్నారు. అక్కడే చనిపోయిన తల్లిని ఆ పసివాడు లేపుతున్న దృశ్యం కన్నీరు పెట్టిస్తోంది. దీనికి మనమంతా సిగ్గుతో తలలు దించుకోవాలి’ అని సిబల్ ట్వీట్ చేశారు. 

లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కూలీలు కొందరు శనివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి శ్రామిక్‌ రైలులో బిహార్‌కు బయలు దేరారు. సోమవారం ముజఫర్‌పుర్ స్టేషన్‌కు చేరుకున్న సమయంలో ఒక మహిళ(35) కుప్పకూలిపోయింది. అక్కడికక్కడే మరణించింది. తల్లి చనిపోయిందని తెలియక ఆమె మీద కప్పి ఉంచిన దుప్పటితో చిన్నారి ఆడుకోవడం సీసీటీవీలో రికార్డయింది. ఆ వీడియోను ఆర్జేడీ నేత సంజయ్ యాదవ్ ట్వీట్ చేయగా, అది వైరల్ అయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని