పూరీ రథయాత్ర వద్దు: సుప్రీం

కరోనా మహమ్మారి దేశాన్ని పీడిస్తోన్న తరుణంలో..ఈ ఏడాది పూరీ జగన్నాథుడి రథయాత్రను నిలిపివేయాలని గురువారం అత్యున్నత న్యాయస్థానం ఆలయ నిర్వాహకులను ఆదేశించింది.

Updated : 21 Dec 2022 16:45 IST

దిల్లీ: కరోనా మహమ్మారి దేశాన్ని పీడిస్తోన్న తరుణంలో..ఈ ఏడాది పూరీ జగన్నాథుడి రథయాత్రను నిలిపివేయాలని  అత్యున్నత న్యాయస్థానం ఆలయ నిర్వాహకులను ఆదేశించింది. ప్రతి ఏడాది నిర్వహించే ఈ రథయాత్రలో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు. దేశం కరోనా సంక్షోభంలో చిక్కుకోకుండా ఉంటే జూన్‌ 23న ఆ కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించేవారు.

ఈ నేపథ్యంలో దాఖలైన వ్యాజ్యాన్ని విచారిస్తూ..‘ఈ యాత్ర జరగడానికి అనుమతి ఇస్తే, జగన్నాథుడు మమ్మల్ని క్షమించడు. ప్రజల ఆరోగ్యం, రక్షణ దృష్ట్యా ఈ ఏడాది రథయాత్రను అనుమతించం’ అని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. నిబంధనలు పాటిస్తూ ఆలయంలో కొన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ సొలిసిటర్ జనరల్ తుషార్‌ మెహతా చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. ‘అలాంటి విషయాల్లో మాకు కావాల్సినన్నీ అనుభవాలున్నాయి. ఒక్క చిన్న కార్యక్రమానికి అనుమతి ఇచ్చినా..ప్రజలు వారి మతపరమైన ఉత్సాహంతో పెద్ద సంఖ్యలో హాజరవుతారు. అందుకే ఈ ఏడాది దేనికి అనుమతి లేదు’ అని బాబ్డే తేల్చిచెప్పారు. 

ఒడిశా వికాస్ పరిషద్ అనే ఎన్‌జీఓ ఈ అంశంపై ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. రథయాత్ర జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయని, అదే జరిగి, లక్షల్లో భక్తులు వస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఆ వ్యాజ్యంలో ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది జరిగిన యాత్రను వీక్షించడానికి సుమారు 10లక్షల మంది హాజరయ్యారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని