తక్కువ బాధతో మరణ దండన!

కరడుగట్టిన నేరగాళ్లకు విధించే ఉరి శిక్ష అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సాధ్యమైనంత తక్కువ నొప్పితో మరణం సంభవించే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

Published : 22 Mar 2023 04:32 IST

ఉరిశిక్షకు ప్రత్యామ్నాయంగా సౌమ్యమైన విధానాల ఎంపికకు నిపుణుల కమిటీ
పరిశీలించి నిర్ణయిస్తామన్న సుప్రీంకోర్టు

దిల్లీ: కరడుగట్టిన నేరగాళ్లకు విధించే ఉరి శిక్ష అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సాధ్యమైనంత తక్కువ నొప్పితో మరణం సంభవించే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని కేంద్రాన్ని ఆదేశించింది. గౌరవప్రద మరణం చాలా ముఖ్యమైన అంశమని అభిప్రాయపడింది. ప్రాణాలు పోయే వరకూ ఉరి తీసే పాత, సంప్రదాయ పద్ధతి స్థానంలో సులభంగా ఉండే ప్రత్యామ్నాయ ఆధునిక మార్గాల ఎంపికకు నిపుణుల కమిటీని నియమించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహాల ధర్మాసనం మంగళవారం సుముఖత వ్యక్తం చేసింది. కమిటీలో జాతీయ న్యాయ వర్సిటీలకు చెందిన నిపుణులు,  ఎయిమ్స్‌ వైద్యులు, శాస్త్రవేత్తలు ఉంటే మంచిదని పేర్కొంది.

ఉరి చాలా బాధాకరమైన ముగింపు అన్న ధర్మాసనం... దీనికంటే తక్కువ బాధతో మరణ శిక్ష అమలుపై చర్చలు ప్రారంభించాలని పేర్కొంది. ఇందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఉరి శిక్ష పడిన ఖైదీలకు నొప్పి లేకుండా జీవితాన్ని ముగించే అవకాశమివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ మేరకు స్పందించింది. ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం.. ఉరిశిక్షకు ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించింది. నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. తుపాకీతో కాల్చడం, ప్రాణాంతక ఇంజెక్షన్‌ ఇవ్వడం, విద్యుత్‌ కుర్చీ వంటి వాటిని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది.

ఉరి శిక్ష చాలా క్రూరమైనదన్న లా కమిషన్‌ నివేదికను పిటిషనర్‌ తరపు న్యాయవాది ధర్మాసనం ముందు చదివి వినిపించారు. ఆ అభిప్రాయంతో ఏకీభవించిన ధర్మాసనం...తమకు శాస్త్రీయ సమాచారం కావాలని పేర్కొంది. ఉరి వల్ల కలిగే నొప్పిపై అధ్యయన సమాచారాన్ని ఇవ్వాలని అటార్నీ జనరల్‌ను కోరింది. అమెరికాలో మరణ శిక్షకు ప్రాణాంతక ఇంజెక్షన్‌ విధానాన్ని అనుసరిస్తున్నారని.. అందులో ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారనే దానిపైనా పరిశోధన చేయాలని జస్టిస్‌ నరసింహ సూచించారు. ప్రాణాంతకమైన ఇంజెక్షన్‌ ద్వారా శిక్ష అమలు కూడా బాధాకరమని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు. తుపాకీతో కాల్చడం మానవ హక్కులను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించారు. ఉరి శిక్ష కాకుండా మరో పద్ధతిని అనుసరిస్తే రాజ్యాంగ విరుద్ధమవుతుందేమో చూడాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని