‘భారత్‌’, ‘సనాతన..’పై ఆచితూచి మాట్లాడండి

‘భారత్‌, సనాతన ధర్మం’ అంశాలపై ఆచితూచి మాట్లాడాలని.. కేంద్రమంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించినట్లు సమాచారం.

Published : 07 Sep 2023 05:42 IST

దిల్లీ: ‘భారత్‌, సనాతన ధర్మం’ అంశాలపై ఆచితూచి మాట్లాడాలని.. కేంద్రమంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించినట్లు సమాచారం. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ భేటీలో ‘భారత్‌’ అంశాన్ని ప్రధాని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీనిపై అతిగా స్పందించొద్దని కేంద్రమంత్రులకు ఆయన సూచించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కేవలం సంబంధిత వ్యక్తులు మాత్రమే దీనిపై మాట్లాడాలని మోదీ స్పష్టం చేసినట్లు తెలిపాయి. అయితే తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలను సమర్థంగా తిప్పికొట్టాలని కేంద్రమంత్రులకు ఆయన సూచించినట్లు సమాచారం. ‘‘చరిత్ర లోతుల్లోకి తొంగిచూడొద్దు. కానీ, రాజ్యాంగం ప్రకారం వాస్తవాలకు కట్టుబడి ఉండండి. సమకాలీన పరిస్థితుల గురించి మాట్లాడండి. వివాదాస్పద వ్యాఖ్యలకు సమర్థమైన స్పందన అవసరం’’ అని మోదీ సూచించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ పేరిట రాష్ట్రపతి పంపిన ఆహ్వాన పత్రాలతో పాటు జీ20 విదేశీ అతిథులకు పంపిణీ చేస్తున్న పుస్తకాల్లోనూ కేంద్ర ప్రభుత్వం ఇండియాకు బదులు భారత్‌ అని ముద్రించింది. దీంతో ఆంగ్లంలోనూ దేశం పేరు ఇక భారత్‌ మాత్రమే ఉండేలా మార్పులు తీసుకురానున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.

అధికార వాహనాలను విడిచిపెట్టండి

జీ20 సదస్సు నేపథ్యంలో విదేశీ అతిథులకు ఏ లోటు రాకుండా చూసుకోవాలని కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సూచించారు. సమావేశం జరిగే భారత్‌ మండపం సహా ఇతర వేదికలు వద్దకు చేరుకునేందుకు అధికారిక వాహనాలను పక్కనబెట్టి షటిల్‌ సర్వీసులను ఉపయోగించాలని కోరారు. జీ20 ఇండియా మొబైల్‌ యాప్‌ను అందరూ డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. తద్వారా విదేశీ ప్రతినిధులతో జరిపే సంభాషణల్లో అందులోని అనువాద సౌకర్యం ఉపయోగపడుతుందన్నారు. ఆ యాప్‌ అన్ని భారతీయ భాషలతోపాటు, జీ20 దేశాల భాషలను తర్జుమా చేయగలదు.


కొందరికి ఆహ్వాన బాధ్యతలు

అంతర్జాతీయ సంస్థలకు చెందిన అధిపతులతోపాటు 40 మంది ప్రపంచ నేతలు ఈ నెల 9-10 తేదీల్లో జరిగే జీ20 సదస్సుకు హాజరవుతున్నారని విదేశీ వ్యవహారాల కార్యదర్శి వినయ్‌ మోహన్‌ క్వాత్రా కేంద్ర మంత్రులకు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రోటోకాల్‌ సంబంధిత విషయాలను వెల్లడించారు. విదేశీ ప్రముఖులను ఆహ్వానించే బాధ్యతలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొందరు మంత్రులకు అప్పగించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని