పింఛన్ల విరాళాలకు త్వరలో పిలుపు

ఆర్థిక స్థోమత ఉన్నవారు వంట గ్యాస్‌పై రాయితీని స్వచ్ఛందంగా వదులుకోవాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతంలో ఇచ్చిన పిలుపు సత్ఫలితానిచ్చింది. ఆ ప్రజాస్పందన స్ఫూర్తితో  పింఛన్లలో నిర్ణీత మొత్తాన్ని అసంఘటిత రంగంలో

Updated : 30 Nov 2021 05:45 IST

రాయితీ వంట గ్యాస్‌ తరహాలోనే ప్రజలకు విజ్ఞప్తి చేయనున్న మోదీ

ఈనాడు, దిల్లీ: ఆర్థిక స్థోమత ఉన్నవారు వంట గ్యాస్‌పై రాయితీని స్వచ్ఛందంగా వదులుకోవాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతంలో ఇచ్చిన పిలుపు సత్ఫలితానిచ్చింది. ఆ ప్రజాస్పందన స్ఫూర్తితో  పింఛన్లలో నిర్ణీత మొత్తాన్ని అసంఘటిత రంగంలో పనిచేసిన పేద వృద్ధ కార్మికుల కోసం త్యాగం చేయాలని ప్రధాని త్వరలో విజ్ఞప్తి చేయనున్నారు. పదవీ విరమణ చేసి గణనీయ మొత్తాల్లో పింఛన్లు పొందుతున్న సంఘటిత రంగ సిబ్బంది ఏటా కనీసం రూ.36వేలను విరాళంగా అందించాలని మోదీ సర్కారు అభ్యర్థించనున్నది. ఈ మొత్తాన్ని అసంఘటిత రంగంలో 60 ఏళ్లు పైబడిన వారికి తలా రూ.3,000 చొప్పున పంపిణీ చేయదలిచారు. ఈ కొత్త ప్రతిపాదనకు ‘పింఛన్‌ విరాళం’ అని నామ కరణం చేశారు. లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడానికి 2018లో ప్రధాన మంత్రి శ్రమయోగి మానధన్‌ (పి.ఎం-ఎస్‌.వై.ఎం) పథకాన్ని చేపట్టారు. దీని కింద అసంఘటిత రంగ కార్మికులు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు పింఛను నిధికి జమ చేస్తే, ప్రభుత్వం అందుకు సమాన మొత్తాన్ని జతచేస్తుంది. కార్మికులకు 60 ఏళ్లు నిండిన తరవాత నుంచి నెలకు రూ.3,000 చొప్పున పింఛను అందుతుంది. 18-40 ఏళ్ల వయోవర్గానికి చెంది, నెల సంపాదన రూ.15,000 కన్నా తక్కువ ఉన్న అసంఘటిత కార్మికులు ఈ స్వచ్ఛంద పింఛను పథకానికి అర్హులు. దేశంలో 38 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నప్పటికీ ఈ ఏడాది అక్టోబరు వరకు 45.1 లక్షల మంది మాత్రమే పథకంలో చేరారు. మిగిలిన వారికి 60 ఏళ్ల తరవాత ఎటువంటి సామాజిక భద్రతా లేదు. పింఛను విరాళ పథకం ద్వారా వారిని ఆదుకోవాలన్నది మోదీ సర్కారు ఉద్దేశం.


లైఫ్‌ సర్టిఫికెట్ల సమర్పణలో ఇబ్బందులు తొలగినట్టే

దిల్లీ: పెన్షన్‌దారులు ఏటా సమర్పించాల్సిన జీవిత ధ్రువపత్రం (లైఫ్‌ సర్టిఫికెట్‌) విషయంలో ఇబ్బందులు తొలగేలా కేంద్రం మరో ప్రయత్నం చేసింది. ‘విశిష్ట ముఖ గుర్తింపు’ సాంకేతిక పరిజ్ఞానాన్ని సోమవారం ఆవిష్కరించింది. జీవిత ధ్రువపత్రానికి బదులుగా ఈ పరిజ్ఞానం ద్వారా ఇచ్చే పత్రాన్ని సాక్ష్యంగా పరిగణిస్తారు. ఇంతవరకు డిజిటల్‌ సర్టిఫికెట్లను మంజూరు చేయగా, ఇప్పుడు ఈ సాంకేతికతను తీసుకువచ్చామని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ చెప్పారు. వయోవృద్ధులకు సులభతర జీవనం ఉండాలన్న ప్రధాని ఆశయంలో భాగంగా ఈ పరిజ్ఞానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని