Rahul Gandhi: పరువునష్టం కేసులో రాహుల్‌ గాంధీకి ఎదురుదెబ్బ

పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి శిక్షను నిలిపివేసేందుకు గుజరాత్‌ హైకోర్టు నిరాకరించింది. కిందికోర్టు తీర్పును సమర్థించింది.

Updated : 07 Jul 2023 13:28 IST

గాంధీనగర్‌: ‘మోదీ ఇంటిపేరు’పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసు (Defamation Case)లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి ఎదురుదెబ్బ తగిలింది. తనకు విధించిన రెండేళ్ల శిక్షను నిలిపివేయాలంటూ వేసిన స్టే పిటిషన్‌ను గుజరాత్‌ హైకోర్టు (Gujarat HC) కొట్టేసింది. ఈ కేసులో సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. ‘రాహుల్‌ ఇప్పటికే దేశవ్యాప్తంగా 10 కేసులను ఎదుర్కొంటున్నారు. ఇక ఈ కేసులో ఆయనకు కిందికోర్టు శిక్ష విధించడం సరైనదే, న్యాయపరమైనదే. ఈ శిక్షను నిలిపివేసేందుకు ఎలాంటి కారణాలు కన్పించట్లేదు. అందుకే పిటిషనర్‌ అభ్యర్థనను కొట్టివేస్తున్నాం’’ అని జస్టిస్‌ హేమంత్‌ ప్రచక్‌ తీర్పు వెలువరించారు.

జైలు శిక్షపై స్టే ఇవ్వకపోవడంతో రాహుల్‌పై అనర్హత (Disqualification) వేటు కొనసాగుతుంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గుజరాత్‌ హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే. అయితే, ఈ కేసులో రాహుల్‌ ఇప్పుడే జైలుకు వెళ్లే అవకాశం లేనట్లు తెలుస్తోంది. శిక్ష అమలును హోల్డ్‌ చేస్తూ గతంలో న్యాయస్థానం ఆయనకు కాస్త ఊరటనిచ్చింది. కాగా.. గుజరాత్‌ హైకోర్టు తీర్పుపై రాహుల్‌ గాంధీ సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో?’ అంటూ 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్‌ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు గానూ గుజరాత్ భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ సూరత్‌ న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ట్రయల్‌ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఈ ఏడాది మార్చిలో తీర్పు వెలువరించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం, పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి.. కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది. దీంతో ట్రయల్‌ కోర్టు తీర్పు వెలువర్చిన 24 గంటల్లోనే రాహుల్‌పై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయింది.

కాగా.. ట్రయల్‌ కోర్టు తీర్పుపై రాహుల్‌ సూరత్‌ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించారు. రెండేళ్ల జైలు శిక్షను నిలుపుదల చేయాలని.. అలాగే తనను దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును సైతం నిలిపివేయాలంటూ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఏప్రిల్‌లో విచారణ జరిపిన సెషన్స్‌ కోర్టు.. ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది. దీంతో ఆయన గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా రాహుల్‌కు నిరాశే ఎదురైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని