Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై

తమ దేశీయుల్ని రక్షించడంలో భారత నౌకాదళం ప్రదర్శించిన ధైర్యసాహసాలకు బల్గేరియా నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. వీటికి ప్రధాని మోదీ(Modi) స్పందించారు. 

Updated : 19 Mar 2024 11:03 IST

దిల్లీ: సోమాలియా సముద్రపు దొంగల (Somalia Pirates) చేతిలో హైజాక్‌కు గురైన ఓ వాణిజ్య ఓడను (MV Ruen)ను భారత నౌకాదళం (Indian Navy) రక్షించడంతో బల్గేరియా అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇందుకు ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు.

మాల్టా పతాకంపై వెళుతున్న నౌక(MV Ruen)ను సముద్రపు దొంగలు గతేడాది డిసెంబరులో హైజాక్‌ చేశారు. ఇతర దేశాల ఓడలను దోచుకునేందుకు దానిని మదర్‌ షిప్‌గా ఉపయోగించే ప్రమాదం ఉందని భారత నేవీ గుర్తించింది. దానిని విడిపించేందుకు ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా, ఐఎన్‌ఎస్‌ సుభద్రలతోపాటు సీ గార్డియన్‌ డ్రోన్లను మోహరించింది. ఆపరేషన్‌లో భాగంగా మన తీరానికి దాదాపు 2600 కిలోమీటర్ల దూరంలో వాయుసేన తన ‘సీ-17’ రవాణా విమానం ద్వారా రెండు చిన్నపాటి యుద్ధ బోట్ల (CRRC)ను కచ్చితమైన ప్రదేశంలో జారవిడిచింది. మార్కోస్‌ కమాండోలూ కిందికి దిగి.. దొంగల ఆటకట్టించారు. మొత్తం 17 మంది బందీలను విడిపించి.. 35 మంది సముద్రపు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. నౌక సిబ్బందిలో ఏడుగురు బల్గేరియా జాతీయులు ఉన్నారు.

బోట్లను జారవిడిచి.. కమాండోలను దించి.. నడిసంద్రంలో 40 గంటల ఆపరేషన్‌

దీనిపై ఇప్పటికే ఆ దేశ విదేశాంగమంత్రి మారియా గాబ్రియెల్ కృతజ్ఞతలు చెప్పగా.. తాజాగా అధ్యక్షుడు రుమెన్‌ రాదెవ్‌ స్పందించారు. ‘‘భారత నేవీ సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్‌ విషయంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు’’ అని సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టారు. ‘‘ఏడుగురు బల్గేరియా జాతీయులు సురక్షితంగా ఉన్నారు. త్వరలో తిరిగి స్వదేశానికి చేరుకుంటారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు, హైజాకింగ్ వంటి చర్యల కట్టడికి మేం కట్టుబడి ఉన్నాం’’ అని మోదీ సమాధానం ఇచ్చారు. ఇప్పటికే ‘‘స్నేహితులు ఉన్నది అందుకే కదా’’ అని మన విదేశాంగ మంత్రి జై శంకర్ కూడా బల్గేరియాకు భరోసానిచ్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని