
India Corona: ఒక్కరోజే 3 లక్షల మంది కోలుకున్నారు..!
20 శాతానికి సమీపించిన పాజిటివిటీ రేటు
దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా మూడోరోజు కొత్త కేసులు మూడులక్షలకు దిగువనే నమోదయ్యాయి. పరీక్షల సంఖ్య తగ్గడంతో రోజువారీ కేసులు తగ్గినప్పటికీ.. పాజిటివిటీ రేటు మాత్రం అమాంతం పెరిగి 20 శాతానికి సమీపించింది. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం...
బుధవారం 14 లక్షల మందికి కరోనా నిర్ధరాణ పరీక్షలు నిర్వహించగా.. 2,86,384 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ముందురోజు కంటే కేసులు స్వల్పంగా పెరిగాయి. అంతకుముందు 16 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు 19.59 శాతానికి చేరింది. కేరళ, కర్ణాటకలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. కేరళలో 49వేలు, కర్ణాటకలో 48 వేల మందికి వైరస్ సోకింది. ఒక్క కేరళనే 140 మరణాలను నివేదించింది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 573 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ 4.03 కోట్ల కరోనా కేసులు రాగా.. 4,91,700 మంది మరణించారు.
కోలుకొంటున్న వైరస్ బాధితులు
ఈ ఉద్ధృతి వేళ.. మెల్లగా రికవరీలు పెరగటం ఊరటనిస్తోంది. నిన్నఒక్కరోజే 3,06,357 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. మొత్తంగా ఇప్పటి వరకు 3.76 కోట్ల మంది వైరస్ను జయించారు. రికవరీ రేటు 93.33 శాతానికి చేరింది. ప్రస్తుతం 22 లక్షల (5.46 శాతం) క్రియాశీల కేసులున్నాయి. నిన్న సెలవు రోజు కావడంతో కేవలం 22 లక్షల మందే టీకా వేయించుకున్నారు. కేంద్రం ఇప్పటివరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 163 కోట్ల మార్కు దాటింది.