PM Modi: భారత్‌ విజయానికి ప్రతీక చంద్రయాన్‌-3: మోదీ

ప్రధాని మోదీ నేడు మన్‌కీ బాత్‌ 104వ ఎపిసోడ్‌లో మాట్లాడారు. దేశంలోని పురాతనమైన భాషల్లో తెలుగు ఒకటని పేర్కొన్నారు. 

Updated : 27 Aug 2023 12:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చంద్రయాన్‌-3 భారత్‌ విజయానికి ఎప్పటికీ ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని మోదీ (PM Modi) కొనియాడారు. మన్‌కీ బాత్‌ (Mann Ki Baat ) 104వ ఎపిసోడ్‌లో నేడు ప్రధాని మాట్లాడారు. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్‌-3 ప్రాజెక్టు మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచిందన్నారు. భారత్‌ వచ్చే నెల దిల్లీలో జీ 20 సమావేశాలకు సిద్ధమవుతోందని.. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 40 దేశాలకు చెందిన ప్రతినిధిలు హాజరుకానున్నారని వెల్లడించారు. తొలిసారి భారత్‌ ఈ స్థాయి జీ-20లో భాగస్వామి అవుతోందని.. గ్రూపును మరింత కలుపుగోలుగా చేస్తోందని చెప్పారు. జీ-20కి భారత్‌ నేతృత్వం అంటే.. ప్రజలే అధ్యక్షత వహిస్తున్నట్లు భావించాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

‘‘భారత్‌ జీ-20 అధ్యక్షత బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి గర్వించదగిన పరిణామాలు చాలా చోటు చేసుకొన్నాయి. ఇప్పటి వరకు ఈ సదస్సులు జరిగిన నగరాల్లో ప్రజలు విదేశీ అతిథులను సాదరంగా ఆహ్వానించారు. భారత్‌లోని వైవిధ్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని చూసి విదేశీ అతిథులు చాలా ప్రభావితమయ్యారు. భారత్‌కు చాలా ఉజ్వల భవిష్యత్తు ఉందని వారు తెలుసుకొన్నారు. జీ-20 సదస్సు శ్రీనగర్‌లో జరిగిన తర్వాత పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

నేడు భారత్‌ క్రీడల్లో నిలకడగా విజయాలు సాధిస్తోంది. తాజాగా చైనాలో జరిగిన ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో రికార్డు స్థాయిలో మనవాళ్లు పతకాలు సాధించారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నాడు దాదాపు 10 కోట్ల మంది జాతీయ పతాకంతో సెల్ఫీ దిగారు.

శ్రావణ పౌర్ణమి సందర్భంగా ప్రపంచ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు. ‘సంస్కృత భారతీ’ ఆధ్వర్యంలో ‘సంస్కృతంలో మాట్లాడే క్యాంప్‌’ నిర్వహిస్తారు. ప్రజలకు ఈ భాషను బోధించడంలో భాగంగా జరిగే క్యాంపులో మీరూ పాల్గొనవచ్చు. అంతేకాదు..  తెలుగు కూడా సంస్కృతంలా పురాతనమైన భారతీయ భాష. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. 

నిదానమే ప్రజ్ఞానం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘మేరీ మాటి.. మేరీ దేశ్‌’ కార్యక్రమం జోరుగా జరుగుతోంది. సెప్టెంబర్‌ నెలలో దేశ వ్యాప్తంగా ప్రతి ఇల్లు, ప్రతి గ్రామం నుంచి మట్టి నమూనా సేకరించే కార్యక్రమం ఉద్యమ స్థాయిలో జరుగుతుంది’’ అని ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో పాల్గొన్న అమ్లాన్‌, ప్రగతి, ప్రియాంక తదితరులతో ముచ్చటించారు. వారి అనుభవాలను అడిగి తెలుసుకొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని