ఆ కరోనా టీకా ఒకే డోసుతో పనిచేస్తుంది!

కరోనా వైరస్‌ నివారణ దిశగా.. అమెరికాలో మరో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. ‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’ సంస్థ రూపొందించిన కొవిడ్‌ టీకాకు అమెరికాలో అత్యవసర వినియోగానికి ఆమోదం లభించింది. ఈ మేరకు ఆ దేశ ఆహార, ఔషధాల విభాగం(ఎఫ్‌డీఏ) శనివారం

Updated : 28 Feb 2021 11:57 IST

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ నివారణ దిశగా.. అమెరికాలో మరో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. ‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’ సంస్థ రూపొందించిన కొవిడ్‌ టీకాకు అమెరికాలో అత్యవసర వినియోగానికి ఆమోద ముద్ర పడింది. ఈ మేరకు ఆ దేశ ఆహార, ఔషధ నిర్వహణ (ఎఫ్‌డీఏ) విభాగం శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికాలో ఇప్పటికే కరోనా కారణంగా 5.10లక్షల మంది మరణించిన విషయం తెలిసిందే. దీంతో టీకా పంపిణీ మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఇలాంటి సమయంలోనే జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాకు అనుమతి లభించడం విశేషం.  
‘కరోనా నుంచి జే అండ్‌ జే టీకా సమర్థవంతమైన రక్షణ కల్పిస్తుంది. మూడు వేర్వేరు ఖండాల్లో ప్రయోగించి ఫలితాలను అధ్యయనం చేసిన తర్వాత.. తీవ్రత ఎక్కువగా ఉన్న కొవిడ్‌-19 కేసుల్లోనూ ఈ టీకా 85శాతం రక్షణ కల్పిస్తుందని తేలింది. మార్పులు కరోనా వైరస్‌ల్లో దక్షిణాఫ్రికా రకంపై కూడా దీని ప్రభావం ఆశాజనకంగా ఉంది. కరోనా వైరస్‌ నిరోధానికి ఇతర టీకాలు రెండు డోసులుగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, కేవలం ఒక డోసుతోనే ఈ టీకా ఆస్థాయిలో పనిచేయడం విశేషం’ అని ఎఫ్‌డీఏ పేర్కొంది. ఈ సందర్భంగా అమెరికా అంటువ్యాధుల విభాగం నిపుణుడు ఆంటోనీ ఫౌచీ మాట్లాడుతూ.. ‘అధిక రక్షణ సామర్థ్యం కలిగిన టీకాలనే మేం వాడుకలోకి తెస్తున్నాం’అని తెలిపారు.

ఈ టీకా సోమవారం నాటికి పలు రాష్ట్రాలకు సరఫరా కానున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, అమెరికాలో మార్చి చివరి నాటికి 2కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని జే అండ్‌ జే సంస్థ లక్ష్యంగా పెట్టుకొంది. ఈ సంస్థ ఇప్పటికే యూరప్‌లోనూ అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకొంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల‌ డోసుల ఉత్పత్తే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టీకా తొలిసారిగా గురువారం నాడు బహ్రైన్‌లో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందింది. అమెరికాలో ఇప్పటికే ఫైజర్‌-బయో ఎన్‌టెక్‌, మోడెర్నా టీకాలు వినియోగిస్తున్న విషయం తెలిసిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని