Kangana Ranaut: కంగనా సెలబ్రిటీనే కావచ్చు.. కానీ, ఆమె ఓ కేసులో నిందితురాలు!

కంగనా రనౌత్‌ సెలబ్రిటీనే కావొచ్చు.. కానీ, ఆమె ఓ కేసులో నిందితురాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ముంబయిలోని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Published : 25 Mar 2022 01:17 IST

బాలీవుడ్‌ నటికి న్యాయస్థానంలో చుక్కెదురు

ముంబయి: పరువునష్టం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు ముంబయిలోని స్థానిక న్యాయస్థానంలో చుక్కెదురయ్యింది. కోర్టులో వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని  కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. కంగనా రనౌత్‌ సెలబ్రిటీనే కావొచ్చన్న కోర్టు.. ఆమె ఓ కేసులో నిందితురాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని స్పష్టం చేసింది. బాలీవుడ్‌ గేయ రచయిత జావేద్‌ అక్తర్‌ దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణకు సహకరించక పోవడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. ఈ కేసులో కంగనా రనౌత్‌ తనకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారన్న మెట్రోపాలిటన్‌ కోర్టు.. ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

ఓ ఇంటర్వ్యూలో భాగంగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కంగనా రనౌత్‌పై బాలీవుడ్‌ గేయ రచయిత జావేద్‌ అక్తర్‌ ఆరోపణలు చేశారు. దీంతో తన పరువుకు భంగం కలిగిందంటూ 2020 నవంబర్‌లో  ఆయన స్థానిక న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు. అయితే, అప్పటినుంచి ఈ కేసు విచారణకు కంగనా రనౌత్‌ హాజరు కావడం లేదు. తాను హిందీ సినిమా ఇండస్ట్రీలో టాప్‌మోస్ట్‌ నటీమణుల్లో ఒకరినని.. వృత్తిపరంగా దేశ, విదేశాల్లో ఎన్నో ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని పేర్కొంటూ వ్యక్తిగత హాజరుకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించింది. అయితే, ఆమె అభ్యర్థనను తిరస్కరించిన న్యాయస్థానం.. కంగనా రనౌత్‌ ఓ సెలబ్రిటీ కావచ్చు.. ఆమె వృత్తిపరంగా ఎంతో బిజీగా ఉండవచ్చు.. కానీ, ఆమె ఓ కేసులో నిందితురాలనే విషయాన్ని మరచిపోవద్దని మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఆర్‌ఆర్‌ ఖాన్‌ స్పష్టం చేశారు.

ఈ కేసు విచారణలో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా, తనకు ఇష్టం వచ్చిన పద్ధతిలో నిందితురాలు వ్యవహరిస్తున్నారని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా వ్యక్తిగత హాజరుకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కోరడం హక్కు కాదనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించింది. తన బెయిల్‌ బాండ్‌ కోసం చట్టపరంగా ఉన్న నియమ నిబంధనలను పాటించాలని మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని