కెనడాలో భారతీయ విద్యార్థుల బహిష్కరణ ముప్పు.. స్పందించిన జై శంకర్‌

కెనడాలో కొందరు భారతీయ విద్యార్థులు గత కొద్దినెలలుగా ఇబ్బందిపడుతున్నారు. దీనిపై కేంద్ర విదేశాంగమంత్రి జై శంకర్(S Jaishankar) స్పందించారు.  

Published : 08 Jun 2023 16:27 IST

ఒట్టావా: కొద్దినెలలుగా కెనడా(canada)లో వందలాదిమంది విద్యార్థులు బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్నారు. దాంతో వారంతా వీధుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కెనడా విశ్వవిద్యాలయాల్లో మోసపూరిత అడ్మిషన్ల ద్వారా వీసాలు పొందామని అధికారులు ఆరోపిస్తున్నారని వారు వాపోయారు. ఇటీవల కెనడా బోర్డర్ సర్వీసెస్‌ ఏజెన్సీ(CBSA) 700 మందికి బహిష్కరణ లేఖలు ఇచ్చింది. విద్యార్థుల అడ్మిషన్ల ఆఫర్‌ లెటర్లు నకిలీవని గుర్తించిన తర్వాత ఈ లేఖలు జారీ చేసింది. 

దీనిపై విద్యార్థులు స్పందిస్తూ.. 2018లో తాము కెనడా(canada) వచ్చామని, కానీ ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాతే ఈ నకిలీ అడ్మిషన్ లెటర్ల విషయం వెలుగులోకి వచ్చిందని ఆరోపిస్తున్నారు. ‘మేం కెనడా వచ్చిన తర్వాత.. మాకు అడ్మిషన్లు లభించిన కళాశాలల్లో సీట్లు భర్తీ అయినట్లు మా ఏజెంట్‌ చెప్పారు. మరో కళాశాలకు ఈ అడ్మిషన్‌ను బదిలీ చేసుకోవచ్చని చెప్పారు. అయితే, ఒక ఏడాదిని కోల్పోకూడదనే ఉద్దేశంతో ఏజెంట్ చెప్పిన మాటకు అంగీకరించాం. మా చదువు పూర్తయింది. కానీ, ఇప్పుడు మాకు బహిష్కరణ లేఖలు పంపారు’ అని ఓ విద్యార్థి వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితి వల్ల తమ మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని, మరికొందరు ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై భారత ప్రభుత్వం... కెనడా ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. ‘మేం అమాయకులం. మేం మోసపోయాం. దాదాపు 700 మంది జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు’ అని మరో విద్యార్థి అన్నారు. వీరిలో ఎక్కువమంది పంజాబ్‌కు చెందినవారే ఉన్నారు.  

స్పందించిన విదేశాంగమంత్రి..

ఈ విద్యార్థుల ఆందోళనపై విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్(External Affairs Minister S Jaishankar) స్పందించారు. వారి సమస్యను పరిష్కరించేందుకు విదేశాంగ శాఖ, హై కమిషన్‌తో కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. ‘బాధ్యులను శిక్షించాలి. విద్యార్థులు ఏ తప్పు చేయకపోతే, వారికి అన్యాయం జరుగుతుందని, ఈ సమస్యకు వారు పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నా. కెనడియన్ వ్యవస్థ ఆ విషయంలో న్యాయంగా ఉంటుందని భావిస్తున్నాను’ అని జై శంకర్(S Jaishankar) వెల్లడించారు. ఈ అంశంపై పంజాబ్ ఎన్‌ఆర్‌ఐ మంత్రి కుల్దీప్‌ సింగ్ ధాలివాల్‌ జై శంకర్‌కు లేఖ రాసిన నేపథ్యంలో ఈ స్పందన వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని