Odisha Train Tragedy: 14 ఏళ్ల క్రితం.. శుక్రవారం నాడు.. ఇదే కోరమాండల్‌!

Odisha Train Tragedy: శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే గతంలోనూ శుక్రవారం రోజే ఓ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది.

Updated : 03 Jun 2023 14:29 IST

బాలేశ్వర్‌: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా భారీ సంఖ్యలో ప్రయాణికులు బోగీల కింద చిక్కుకొని ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుత ఘటన 2009 నాటి రైలు ప్రమాదాన్ని గుర్తుకుతెస్తోంది. అప్పుడు కూడా సరిగ్గా శుక్రవారం రాత్రి ఏడుగంటల సమయంలో ఇదే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది.

14 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 13, 2009న ఒడిశాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. ఆ రోజు కూడా శుక్రవారమే. రాత్రి 7.30 నుంచి 7.40 మధ్య ప్రమాదం జరిగింది. అప్పుడు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ అత్యంత వేగంతో జైపుర్ రోడ్ రైల్వే స్టేషన్‌ దాటుతోంది. ట్రాక్‌ మార్చుకుంటున్న సమయంలో అదుపు తప్పడంతో రైలు పట్టాలు తప్పి బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇంజిన్ మరో ట్రాక్‌ మీద పడిపోయింది. ఆ ఘటనలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుత ప్రమాదంతో పలు బోగీలు పూర్తిగా దెబ్బతినగా.. కొన్ని బోగీలు సురక్షితంగానే ఉన్నాయి. అయితే, అందులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొద్దిసేపటివరకు ఏం జరిగిందో తెలీక గందరగోళానికి గురయ్యారు. ‘ఒక్కసారి భారీ కుదుపునకు లోనయ్యాం. రైలు బోగీలు ఒక పక్కకు పడిపోవడం కనిపించింది. పట్టాలు తప్పిన కుదుపులకు మాలో కొందరు బోగీల నుంచి బయటకుపడిపోయారు. మేం ఎలాగో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాం’ అని కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికుడు ఒకరు వెల్లడించారు. అలాగే ఆ ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని