బాలికను నేరుగా తాకనందున లైంగిక వేధింపులు కాదనడం సరికాదు

‘‘బాలిక శరీరాన్ని నిందితుడు నేరుగా తాకనప్పుడు (స్కిన్‌-టు-స్కిన్‌ కాంటాక్ట్‌ లేనప్పుడు), ఆ చర్య పోక్సో చట్ట నిబంధనల ప్రకారం లైంగిక వేధింపుల కిందకు రాదు’’ అంటూ...

Updated : 25 Aug 2021 09:52 IST

బాంబే హైకోర్టు తీర్పు హానికరమన్న అటార్నీ జనరల్‌

దిల్లీ: ‘‘బాలిక శరీరాన్ని నిందితుడు నేరుగా తాకనప్పుడు (స్కిన్‌-టు-స్కిన్‌ కాంటాక్ట్‌ లేనప్పుడు), ఆ చర్య పోక్సో చట్ట నిబంధనల ప్రకారం లైంగిక వేధింపుల కిందకు రాదు’’ అంటూ... బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలని అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ తీర్పు హానికరమైనదని, అనేక ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఓ బాలికపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో బాంబే హైకోర్టు (నాగ్‌పుర్‌ ధర్మాసనం) ఈ ఏడాది జనవరిలో తీర్పు వెల్లడించింది. దుస్తులు ధరించి ఉన్న బాలిక ఛాతీ భాగాన్ని నిందితుడు తాకడం పోక్సో చట్టంలో పేర్కొన్న లైంగిక వేధింపుల కిందకు రాదని వ్యాఖ్యానించింది. నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పుపై బాలల హక్కుల కార్యకర్తలు, న్యాయ నిపుణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును తప్పుపట్టారు. దీన్ని నిలిపివేయాలంటూ అటార్నీ జనరల్‌తో పాటు జాతీయ మహిళా కమిషన్‌ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో జనవరి 27న సర్వోన్నత న్యాయస్థానం.. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపేసింది. కాగా, ఈ వ్యవహారంపై జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగిల ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. వాదనల సందర్భంగా వేణుగోపాల్‌ మాట్లాడుతూ- ‘‘బాంబే హైకోర్టు తీర్పు చాలా ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుంది. రేపొద్దున్న ఎవరైనా చేతులకు సర్జికల్‌ తొడుగులను ధరించి, బాలికల ఛాతీ భాగాలను తాకితే దాన్ని నేరం కాదనే పరిస్థితి రావచ్చు. ఈ కేసులో నిందితుడి చర్య లైంగిక వేధింపుల కిందకే వస్తుంది. భవిష్యత్‌ పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండా, బాంబే హైకోర్టు తీర్పు వెల్లడించింది’’ అని పేర్కొన్నారు. నిందితుడి తరఫున వాదనలు వినిపించేందుకు ఎవరూ హాజరుకాలేదు. దీంతో అతడి తరఫున సీనియర్‌ న్యాయవాది లేదా అడ్వొకేట్‌-ఆన్‌-రికార్డ్‌ను సమకూర్చాలని సుప్రీంకోర్టు లీగల్‌ సర్వీస్‌ కమిటీని ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయంలో కోర్టు సహాయకులుగా సీనియర్‌ న్యాయవాది సిద్ధార్ధ్‌ దవేను ఇప్పటికే నియమించినట్టు ధర్మాసనం వెల్లడించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 14కు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు