స్వాతంత్య్ర సంగ్రామంలో సినీమాతరం

డెబ్భై అయిదేళ్ల స్వేచ్ఛ వాయువుల వెనుక దేశమంతా ఒక్కటై చేసిన ఓ మహా సంగ్రామముంది

Updated : 15 Aug 2021 07:06 IST

డెబ్భై అయిదేళ్ల స్వేచ్ఛ వాయువుల వెనుక దేశమంతా ఒక్కటై చేసిన ఓ మహా సంగ్రామముంది

రెపరెపలాడే మువ్వన్నెల జెండా వెనుక తెల్లదొరలకు ఎదురుతిరిగిన వీరత్వం, మడమతిప్పని పోరాట యోధుల ధీరత్వం దాగుంది

ఆ సంగ్రామాన్ని, ఆ వీరుల గాథలను చిత్ర సీమ వెండితెరకెక్కిస్తూ... పులకించిపోయింది

ఈ అమృత్సవాలకు కళామతల్లి పరవశిస్తోంది

మువ్వన్నెల జండాకు సినీమాతరం వందనమంటోంది

దాదాపు 200 సంవత్సరాల పరాయి పాలనకు చరమగీతం పాడేదాకా సాగిన భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కళలు, కళాకారుల పాత్ర ఎన్నదగ్గది. ఈ ఉద్యమం పతాకస్థాయికి చేరుకున్న దశలోనే భారతీయ సినిమా మాటలు నేర్చింది. ఈ దశలో నాటి భారతీయ సమాజంలో వేళ్లూనుకుపోయి ఉన్న మూఢాచారాల నుంచి ప్రజలను  చైతన్యపరుస్తూ స్వాతంత్య్ర పోరాటం దిశగా వారిని   కార్యోన్ముఖులను చేసేలా చిత్రాలు వచ్చాయి. అంటరానితనం వద్దన్న మహాత్ముని ఆశయ స్ఫూర్తితో ‘మాలపిల్ల’ వంటి చిత్రాలు తీశారు. కలికి కృష్ణమూర్తి నవల ఆధారంగా తమిళంలో తీసిన ‘త్యాగభూమి’ (1939) చిత్రం ఈ వరుసలో చెప్పుకోదగ్గది. విడుదల కాగానే దీన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధించింది. ఈ చిత్రకథ ప్రముఖ తమిళ వీక్లీ ‘ఆనంద వికటన్‌’లో సీరియల్‌గా రావడం ఒకింత ఊరట.

* స్వాతంత్య్రానంతరమూ జాతీయోద్యమం ఆధారంగా వివిధ భాషల్లో పలు చిత్రాలు వచ్చాయి. 1996లో  మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రధారిగా ప్రియదర్శన్‌ దర్శకత్వంలో వచ్చిన బహు భాషాచిత్రం ‘కాలాపానీ’ నాటి ఉద్యమ ఖైదీల కష్టాలను కళ్లకు కట్టింది. మలయాళంలో ప్రముఖ దర్శకుడైన ఐ.వి.శశి 1988లో మమ్ముట్టి, సురేష్‌ గోపి వంటి తారాగణంతో తీసిన భారీచిత్రం ‘1921’ బ్రిటిష్‌ పాలకులపై కేరళలో 1920ల్లో తలెత్తిన మలబారు తిరుగుబాటును చూపుతుంది. 1824 ప్రాంతంలోనే ఈస్ట్‌ ఇండియా కంపెనీపై ముమ్మారు దండెత్తి వీరమరణం పొందిన ధీరవనిత కిత్తూరు రాణి చెన్నమ్మ. ఈమె జీవితకథ ఆధారంగా బి.ఆర్‌.పంతులు 1961లో తీసిన కన్నడచిత్రం ‘కిత్తూరు చెన్నమ్మ’లో బి.ఆర్‌.సరోజాదేవి ఆ పాత్ర పోషించారు.

8 ఆస్కార్‌లు గెలిచిన ‘గాంధీ’

మహాత్ముడి జీవితకథ ఆధారంగా 1982లో రిచర్డ్‌ ఆటెన్‌బరో తీసిన ‘గాంధీ’ చిత్రం విశ్వవేదికపై 11 నామినేషన్లు పొంది, ఏకంగా 8 ఆస్కార్‌ అవార్డులు గెలుచుకోవడం విశేషం. హిందీలో జాతీయోద్యమ కథలతో ప్రేమ్‌కహానీ (1975), క్రాంతి (1981) వంటి చిత్రాలు వచ్చాక.. మళ్లీ ఇరవై ఏళ్లకు నటుడు ఆమిర్‌ఖాన్‌ ‘లగాన్‌’, ‘మంగళ్‌పాండే’, ‘రంగ్‌ దే బసంతి’ వంటి చిత్రాలతో ఆ ఊపు తీసుకొచ్చారు. భగత్‌సింగ్‌. ఈ విప్లవయోధుడి జీవిత చరిత్రపై పూర్తి నిడివితో హిందీలో ఏకంగా ఏడు చిత్రాలు రూపుదిద్దుకొన్నాయి.

- జి.ఎస్‌.జమీర్‌ హుసేన్‌


తెలుగు బావుటా

స్వరాజ్య కాంక్ష కోసం ఆంగ్ల దొరలపై నిప్పుల చెరిగిన తెలుగు వీరుడు ‘అల్లూరి సీతారామారాజు’. టైటిల్‌ రోల్‌ పోషిస్తూ సూపర్‌ స్టార్‌ కృష్ణ నటించిన ఈ చిత్రం ప్రభంజనం సృష్టించింది. ఇందులో కృష్ణ అల్లూరి పాత్రలో పరాకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి. ‘ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు’లాంటి కృష్ణ చెప్పిన డైలాగ్స్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

రేనాటి సీమ కన్న సూరీడు ‘సైరా’

స్వాతంత్య్రం కోసం జరిగిన తొలి యుద్ధంలో వీరోచితంగా పోరాడిన రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆ తిరుగుబాటునే కథాంశంగా ‘సైరా’   తెరకెక్కింది. భారతీయుల గుండెలను ఉప్పొంగేలా చేసిన ఆ ఉద్యమగాథను సజీవంగా తెలుగు ప్రేక్షకులకు అందించారు మెగాస్టార్‌. ‘రేనాడు వీరులారా.. చరిత్రలో మనం ఉండకపోవచ్చు, చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి’ అంటూ చిరంజీవి వెండితెరపై చేసిన గర్జనకు బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిసింది. 

తూటాకి రొమ్మువిరిచిన ‘ఆంధ్రకేసరి’

బ్రిటీష్‌ దొరల తుపాకీ తూటాలకు రొమ్ము విరిచి ‘ఇక్కడ కాల్చు’ అంటూ గుండెలను చూపించిన వీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు. ఆయన జీవితం ఆధారంగా తెలుగులో ‘ఆంధ్రకేసరి’ చిత్రం తెరకెక్కింది. విజయ్‌చందర్‌ టైటిల్‌ పాత్రను పోషిస్తూ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని నంది అవార్డు కూడా వరించింది.

కొమరం-అల్లూరి

దర్శకధీరుడు రాజమౌళి ఏకంగా ఇద్దరు పోరాట యోధులను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం కోసం కీలక పాత్రలుగా మలచుకున్నాడు. ఆంగ్లేయుల తూటాలకు ఎదురెళ్లిన అల్లూరితో, నిజాంపై పోరు జరిపిన గోండు వీరుడు కొమరం భీమ్‌ స్నేహం చేస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. స్వరాజ్య స్థాపనకోసం ప్రాణాలు వదిలిన త్యాగధనులు, అమరవీరుల సినిమాలతో ప్రేక్షకుల గుండెలను దేశభక్తితో నింపింది తెలుగు సినీ పరిశ్రమ.


మాతృదేశం కోసం ‘హాలీవుడ్‌’ చిత్రాల్లో...

1919 నాటి జలియన్‌వాలా బాగ్‌ మారణకాండకు ప్రతీకారంగా అప్పటి పంజాబ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మైకేల్‌ ఓ డ్వాయర్‌ను లండన్‌లో కాల్చిచంపిన    ఉద్ధంసింగ్‌ జీవితంలోని ఓ ప్రత్యేకకోణం చాలామందికి తెలియదు. నాడు లండన్‌ కేంద్రంగా భారత స్వాతంత్య్ర పోరాటానికి పథక రచన చేస్తున్న గదర్‌ పార్టీలో ఈయన కీలక సభ్యుడు. ఈ ఉద్యమానికి ఆర్థిక వనరుల సేకరణలో భాగంగా.. అప్పట్లో లండన్‌లో చిత్రీకరణ జరుపుకొన్న ఎలిఫెంట్‌ బాయ్‌ (1937), ది ఫోర్‌ ఫెదర్స్‌ (1939) హాలీవుడ్‌ చిత్రాల్లో ఉద్ధంసింగ్‌ నటించారు. పెద్దపాత్రలు కాకపోయినా భారత్‌ నుంచి హాలీవుడ్‌లో నటించిన తొలినటుడు ఈయనే అని చెప్పవచ్చు. బ్రిటీషర్లు ఉరి తీసిన ఉద్ధంసింగ్‌ జీవితకథ ఆధారంగా ప్రముఖ నటుడు రాజ్‌బబ్బర్‌ కీలకపాత్రలో ‘షహీద్‌ ఉద్ధంసింగ్‌’ (2000) చిత్రం వచ్చింది. భారతీయుల్లో జాతీయస్ఫూర్తిని నింపుతూ ఇలా ఎన్నో చిత్రాలు వెండితెర మీదకు వచ్చాయి.. వస్తున్నాయి. సెల్యులాయిడ్‌పై పరచుకున్న ఈ మువ్వన్నెల స్ఫూర్తిమంత్రం అనంతం.


భారతమాతకు జై

పద్మశ్రీ చిత్తూరు నాగయ్య.. ఈ పేరు చెప్పగానే పాత సినిమాల్లోని తండ్రి పాత్రలు గుర్తుకువస్తాయి. ఇంకాస్త సినీ   పరిజ్ఞానం ఉన్నవాళ్లు ఆయన ప్రధానపాత్రల్లో నటించిన ‘భక్త పోతన’ వంటి క్లాసిక్‌ సినిమాల పేర్లు చెబుతారు. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 200 చిత్రాల్లో నటించిన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి స్వాతంత్య్ర సమరయోధుడని తక్కువ  మందికే గుర్తుంటుంది. 1930 నాటికి నాగయ్య ఆంధ్రపత్రికలో జర్నలిస్టుగా పనిచేసేవారు. గాంధీ, నెహ్రూల స్ఫూర్తితో నాటి దండి సత్యాగ్రహంలో పాల్గొని ‘భారతమాతకు జై’ అంటూ నినదించారు.


ఘంటసాల... 18నెలల చెరసాల

పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు.. తెలుగువారు భద్రంగా దాచుకునేలా భగవద్గీతను అద్భుతంగా గానం చేయడంతోపాటు పలు భాషల్లో వేలాది సినీ, జానపద గీతాలు పాడిన అమర గాయకుడిగా అందరికీ తెలుసు.  సినిమాల్లోకి రాకముందు వీధి గాయకుడిగా పాటలు పాడుకునే రోజుల్లో 1942 నాటి క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని 18 నెలలు జైలుపాలయ్యారన్న విషయం కొద్దిమందికే తెలుసు. ఈయనను కోల్‌కతాలోని అలీపుర్‌ జైలుకు బ్రిటిష్‌ ప్రభుత్వం తరలించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని