థియేటర్లపై ఆంక్షలు ఎత్తివేయండి: హీరో విజయ్‌

కరోనా నేపథ్యంలో సినిమా థియేటర్లపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని తమిళ సినీ హీరో విజయ్‌ తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామికి విజయ్‌ ఓ అభ్యర్థన చేశారు. ప్రస్తుతం విజయ్‌ కథానాయకుడిగా నటించిన ‘మాస్టర్‌’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

Published : 29 Dec 2020 01:21 IST

చెన్నై: కరోనా నేపథ్యంలో సినిమా థియేటర్లపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని తమిళ సినీ హీరో విజయ్‌ తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామికి విజయ్‌ ఓ అభ్యర్థన చేశారు. ప్రస్తుతం విజయ్‌ కథానాయకుడిగా నటించిన ‘మాస్టర్‌’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్‌ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించింది. సంక్రాంతికి కానుకగా ఈ సినిమాను అభిమానుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 2021 జనవరి 7 నుంచి టికెట్ల బుకింగ్‌ ప్రారంభించనున్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో.. థియేటర్లపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను సడలించి, 100శాతం ప్రేక్షకులను అనుమతించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని విజయ్‌ కోరారు. అయితే.. విజయ్‌ అభ్యర్థనపై ముఖ్యమంత్రి ఎలా స్పందించారనేది ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ఇటీవల సీబీఎఫ్‌సీ(సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌) నుంచి యూ/ఏ సర్టిఫికెట్‌ను కూడా పొందింది. తొలుత ‘మాస్టర్‌’ ఓటీటీ వేదికగా విడుదలవుతుందన్న వార్తలు వినిపించాయి. అయితే.. ‘అలాంటిదేం లేదు, సినిమాను కచ్చితంగా థియేటర్‌లోనే విడుదల చేస్తాం’ అని చిత్రబృందం స్పష్టం చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ సరసన మాళవికా మోహన్‌ నటించనుంది. అర్జున్‌ దాస్, సిమ్రన్‌, ఆండ్రియా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీత దర్శకులు. ఎక్స్‌బీ ఫిల్మ్స్‌, సెవన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో చిత్రాన్ని విడుదల కానుంది.

ఇదీ చదవండి..

ఏ.ఆర్‌.రెహమాన్‌ ఇంట విషాదం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని