Valimai: ‘వలిమై’ కొత్త అనుభూతిని పంచుతుంది!

‘‘తెలుగు సినిమాని హిందీలో రీమేక్‌ చేయడంతో నిర్మాతగా నా కెరీర్‌ ప్రారంభమైంది. నేను బాలీవుడ్‌ నిర్మాతనే అయినా, నా మనసెప్పుడూ దక్షిణాది సినిమాలపైనే ఉంటుంది’’ అన్నారు బోనీకపూర్‌. ఆయన నిర్మించిన చిత్రం ‘వలిమై’. అజిత్‌ కథానాయకుడు. హ్యూమా ఖురేషి కథానాయిక.

Updated : 23 Feb 2022 08:14 IST

‘‘తెలుగు సినిమాని హిందీలో రీమేక్‌ చేయడంతో నిర్మాతగా నా కెరీర్‌ ప్రారంభమైంది. నేను బాలీవుడ్‌ నిర్మాతనే అయినా, నా మనసెప్పుడూ దక్షిణాది సినిమాలపైనే ఉంటుంది’’ అన్నారు బోనీకపూర్‌. ఆయన నిర్మించిన చిత్రం ‘వలిమై’. అజిత్‌ కథానాయకుడు. హ్యూమా ఖురేషి కథానాయిక. తెలుగు కథానాయకుడు కార్తికేయ ప్రతినాయకుడిగా నటించారు. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాని గోపీచంద్‌ ఇనుమూరి గురువారం తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘నేను తీసిన ‘ఖాకీ’ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆస్వాదించారో, అంతకుమించి అనుభూతిని పంచే చిత్రమిది. భావోద్వేగాలతోపాటు అందరికీ నచ్చే అంశాలు ఇందులో ఉన్నాయి’’ అన్నారు. బోనీకపూర్‌ మాట్లాడుతూ ‘‘బాపు దర్శకత్వం వహించిన ‘మనవూరి పాండవులు’ సినిమాని హిందీలో ‘హమ్‌ హై పాంచ్‌’ పేరుతో రీమేక్‌ చేశా. దర్శకుడు బాపు నాకెన్నో కొత్త విషయాల్ని నేర్పించారు. అజిత్‌తో ‘కాల్‌ కోటై’, ‘వాలి’ సినిమాల నుంచి అనుబంధం ఏర్పడింది. ఆయనతో మూడు సినిమాలు చేసే అవకాశం దక్కింది. మేం నాలుగో సినిమాని కూడా చేస్తాం. అజిత్‌, వినోద్‌ ఇద్దరూ రిస్క్‌ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈ సినిమా ఓ అద్భుతమైన ప్రయాణం. కార్తికేయ చాలా కూల్‌గా కనిపిస్తాడు కానీ... ఇందులో తనని చూస్తే భయపడతాం. అలా నటించాడు. ఈ సినిమా ఓ కొత్త అనుభూతిని పంచుతుంది. తెలుగులోనూ సినిమాలు నిర్మించడం కోసం ఎదురు చూస్తున్నా. నా కుమార్తె జాన్వి కపూర్‌ తప్పకుండా తెలుగులో సినిమా చేస్తుంది. మంచి స్క్రిప్ట్‌ కోసం ఎదురు చూస్తోంది’’ అన్నారు. కార్తికేయ మాట్లాడుతూ ‘‘నేను, నా స్నేహితుడు కలిసి ‘ఖాకీ’ సినిమా చూశా. ఈ దర్శకుడు నాతో సినిమా చేస్తానంటే స్క్రిప్ట్‌ కూడా వినకుండా ఒప్పుకుంటా అన్నా. నిజంగా మూడేళ్ల తర్వాత అదే దర్శకుడితో కలిసి పనిచేసే అవకాశం ఈ సినిమాతో వచ్చింది. అజిత్‌ సర్‌తో కలిసి పనిచేయడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సినిమాలతోనూ, నటనతోనూ సంబంధం లేని హీరోలు ఇక్కడ పవన్‌కల్యాణ్‌ అయితే, తమిళనాడులో అజిత్‌ సర్‌. ఇద్దరి సినిమాలూ ఒకేసారి వస్తున్నాయి. కచ్చితంగా అభిమానులు ఆస్వాదించే సందర్భం ఇది. మనమెంతో ఇష్టపడే శ్రీదేవి మేడమ్‌ నిర్మాణ సంస్థలో పనిచేసే అవకాశం రావడం గర్వంగా అనిపించింది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో హ్యూమాఖురేషి, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని