తెలంగాణలో షూటింగ్‌లకు అనుమతి

కొవిడ్-19 మార్గదర్శకాలు, లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ తెలంగాణలో సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు

Updated : 08 Jun 2020 18:22 IST

హైదరాబాద్‌: కొవిడ్-19 మార్గదర్శకాలు, లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ తెలంగాణలో సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించిన దస్త్రంపై కేసీఆర్ సోమవారం సంతకం చేశారు. రాష్ట్రంలో పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా/టీవీ కార్యక్రమాల షూటింగులు నిర్వహించుకోవచ్చని, షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే నిర్వహించుకోవచ్చని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సి ఉన్నందున థియేటర్లను ప్రారభించడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి సినిమా, టీవీ షూటింగులకు, పోస్ట్‌ ప్రొడక్షన్ పనులకు, సినిమా థియేటర్లు తెరవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సినీరంగ ప్రముఖులు సమావేశమై విధివిధానాల ముసాయిదాను రూపొందించారు. 

ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి, పరిమిత సిబ్బందితో షూటింగులు, పోస్టు ప్రొడక్షన్ పనులు నిర్వహించుకుంటామని సినీ రంగ ప్రముఖులు హామీ ఇచ్చారు. దీనిని అనుసరించి ముఖ్యమంత్రి కేసీఆర్ షూటింగులు, పోస్టు ప్రొడక్షన్ పనులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఇప్పటికిప్పుడు సినిమా థియేటర్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని