సంక్షిప్త వార్తలు(3)

నటి, నిర్మాత, వ్యాఖ్యాత, వ్యాపారవేత్త, ఐరాస రాయబారి, గ్లోబల్‌ ఐకాన్‌.. ఇలా బహుముఖ పాత్రలు పోషిస్తున్న కథానాయిక ప్రియాంక చోప్రా. తాజాగా ఆమె సినీ కెరియర్‌లో మరో మెట్టు ఎక్కింది.

Updated : 29 Mar 2023 05:29 IST

ఆస్కార్‌ కమిటీలో ప్రియాంక

నటి, నిర్మాత, వ్యాఖ్యాత, వ్యాపారవేత్త, ఐరాస రాయబారి, గ్లోబల్‌ ఐకాన్‌.. ఇలా బహుముఖ పాత్రలు పోషిస్తున్న కథానాయిక ప్రియాంక చోప్రా. తాజాగా ఆమె సినీ కెరియర్‌లో మరో మెట్టు ఎక్కింది. ప్రియాంక ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్యాచ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో సభ్యురాలిగా చేరనుందని అకాడెమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ తాజాగా తెలిపింది. ఇందులో సభ్యత్వం కోసం బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ నుంచి ఆహ్వానం అందుతుంది. ఆస్కార్‌ పోటీలో నామినేషన్‌ సాధించిన వారు మాత్రమే ఈ సభ్యత్వ అర్హత పొందుతారు.


జూన్‌లో ‘మైదాన్‌’ బరిలోకి..

అజయ్‌ దేవగణ్‌ అభిమానులకు డబుల్‌ ధమాకా శుభవార్త. అనేకసార్లు వాయిదా పడుతూ వస్తున్న ‘మైదాన్‌’ జూన్‌ 23న థియేటర్లలోకి వస్తున్నట్టు సినీవర్గాలు మంగళవారం ప్రకటించాయి. ఆయన నటించిన ‘భోళా’ మార్చి 30న ప్రేక్షకుల ముందుకొస్తోంది. అదేరోజున టీజర్‌ని విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా అజయ్‌ దేవగణ్‌ ఓ కొత్త పోస్టర్‌ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ‘ఒక వ్యక్తి... ఒకటే నమ్మకం.. ఒకే స్థైర్యం ‘మైదాన్‌’. ఇది ఓ యోధుడి కథ. దీంతో మైదానంలో భారత్‌ జెండా ఎగురుతుంది. మార్చి 30న టీజర్‌ మీ ముందుకొస్తుంది’ అంటూ వ్యాఖ్యానించారు. అమిత్‌ రవిందర్‌నాథ్‌ శర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి, గజ్‌రాజ్‌రావు కీలక పాత్రలు పోషించారు. ఫుట్‌బాల్‌ ఆటకోసం సర్వస్వం ధారపోసిన సయ్యద్‌ అబ్దుల్‌ రహీం అనే భారత జట్టు కోచ్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. హిందీతోపాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. ఆకాష్‌ చావ్లా, అరుణవజాయ్‌ సేన్‌గుప్తా నిర్మాతలు.


చెన్నైలో కొత్త షెడ్యూల్‌..

విజయ్‌-లోకేష్‌ కనగరాజ్‌ కలయికలో రూపొందుతోన్న సినిమా ‘లియో’. ‘మాస్టర్‌’ వంటి హిట్‌ తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో చిత్రమిది. సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో పతాకంపై నిర్మిస్తున్నారు. త్రిష కథానాయిక. సంజయ్‌ దత్‌, గౌతమ్‌ మేనన్‌, మిస్కిన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే కశ్మీర్‌లో ఓ మేజర్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కొత్త షెడ్యూల్‌ బుధవారం నుంచి చెన్నైలో మొదలు కానుందని సమాచారం. ఇందులో విజయ్‌, సంజయ్‌దత్‌లతో పాటు మిగిలిన ప్రధాన తారాగణం పాల్గొననుంది. మే నాటికి చిత్రీకరణ పూర్తి చేసేలా ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో క్లైమాక్స్‌ చిత్రీకరణ చేస్తారని సమాచారం. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో విజయ్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. సంగీతం: అనిరుధ్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని