‘జై అల్లు అర్జున్‌’... అనాలంటూ యువకుడిని చితకబాదారు

అభిమానుల మధ్య మాటల యుద్ధం సామాజిక మాధ్యమాలను దాటి వ్యక్తిగత దాడుల వరకూ వెళ్లింది. తాజాగా ఈ విషయంపై బెంగళూరులో ఓ యువకుడిని చితకబాదారు

Published : 11 Mar 2024 17:40 IST

బెంగళూరు: అభిమానం హద్దులు దాటుతోంది. ఇప్పటివరకూ సామాజిక మాధ్యమాల వేదికగా మాటల యుద్ధం నడుస్తుండగా ఇప్పుడది వ్యక్తిగత దాడుల వరకూ వెళ్లింది.  పాన్‌ఇండియా సినిమాలతో తెలుగు హీరోలకు సైతం వివిధ రాష్ట్రాల్లో అభిమానులు ఏర్పడ్డారు. ఈక్రమంలో తమ హీరోపై వచ్చే చిన్న విమర్శను కూడా వారు తట్టుకోలేకపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ‘జై అల్లు అర్జున్‌’ అనాలంటూ కొందరు వ్యక్తులు కలిసి ఓ యువకుడిని చితకబాదారు. జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తూ, చేతులతో పిడి గుద్దులతో విరుచుకుపడ్డారు. ఆ యువకుడి ముక్కు నుంచి రక్తం కారుతున్నా ఆపకుండా ‘జై అల్లు అర్జున్‌ అనరా.. అప్పుడు వదులుతాం’ అంటూ దాడి చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అయింది. కొందరు నెటిజన్లు ఈ వీడియోను ఎక్స్‌ వేదికగా బెంగళూరు నగర పోలీస్‌శాఖ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన పోలీస్‌శాఖ వివరాలు తెలుసుకుని, కేఆర్‌ పురం పోలీస్‌స్టేషన్‌, డీసీపీ వైట్‌ఫీల్డ్‌ డివిజన్‌ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. గత కొన్ని రోజులుగా ప్రభాస్‌, అల్లు అర్జున్‌ అభిమానులమంటూ చెప్పుకొనే కొందరు వ్యక్తుల మధ్య ఎక్స్‌ వేదికగా మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరి హీరోను మరొకరు విమర్శించుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన పోస్ట్‌లను కూడా నెటిజన్లు బెంగళూరు నగర పోలీస్‌శాఖ ఎక్స్‌ ఖాతాను ట్యాగ్‌ చేస్తూ స్క్రీన్‌షాట్స్‌ పంచుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని