Tamannaah: తమన్నాకు రూ.2కోట్ల విలువైన వజ్రం గిఫ్ట్‌ ఇచ్చిన ఉపాసన.. అసలు కథ ఇది!

Tamannaah: గతంలో తమన్నా ధరించిన ఓ వజ్రం గురించి ఆసక్తికర విషయాన్ని ఆమె ఇప్పుడు బయటపెట్టింది.

Published : 26 Jul 2023 01:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒక పక్క విభిన్న కథల్లో నటిస్తూనే మరోవైపు అగ్ర హీరోలతో తెరపంచుకుంటూ వరుస అవకాశాలు దక్కించుకుంటున్న అందాల భామ తమన్నా (Tamannaah). ఇటీవల ‘లస్ట్‌ స్టోరీస్‌2’లో తన అందాలతో కట్టిపడేసింది. అలాగే ‘జైలర్‌’లో ‘నువ్వు కావాలయ్యా’ పాటలకు స్టెప్‌లేసి యువత మతిపోగొట్టింది. తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టాలో పెట్టిన స్టేటస్‌ చూసి, అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. ‘అప్పట్లో వచ్చిన వార్తలు నిజం కాదా’ అంటూ నోరెళ్ల బెడుతున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. చిరంజీవి కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్‌ మూవీ ‘సైరా: నరసింహారెడ్డి’. తమన్నా ఇందులో కీలక పాత్ర పోషించింది. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మించారు. ఈ సినిమాలో నటించినందుకు గానూ చరణ్‌ సతీమణి ఉపాసన రూ.2కోట్ల విలువైన వజ్రాన్నిఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద వజ్రం అంటూ ప్రచారం జరిగింది. అయితే, అది నిజం కాదంటూ చావు కబురు చల్లగా చెప్పింది తమన్నా. వజ్రంలాంటి ఆ ఆభరణాన్ని చేతికి ధరించి, ‘ఈ విషయం ఇలా మీకు చెప్పడానికి ఎంతో బాధపడుతున్నా. ఆరోజు మేము బాటిల్‌ ఓపెనర్‌తో ఫొటో షూట్‌ చేశాం. నేను చేతికి పెట్టుకున్నది నిజమైన వజ్రం కాదు’ అని ఇన్‌స్టా స్టేటస్‌లో పెట్టడంతో ఆమె అభిమానులతో పాటు, నెటిజన్లు అవాకయ్యారు. ప్రస్తుతం తమన్నా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ‘భోళా శంకర్‌’, ‘జైలర్’, ‘అరణ్మణై4’, ‘భద్ర’, ‘వేద’చిత్రాల్లో నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని