టొరంటోలో ‘ధూం ధాం’గా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ కెనడా అసోసియేషన్‌ (టీసీఏ) ఆధ్వర్యంలో జులై 9 శనివారం గ్రేటర్‌ టొరంటో నగరంలోని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు .......

Updated : 13 Jul 2022 19:01 IST

టొరంటో: తెలంగాణ కెనడా అసోసియేషన్‌ (టీసీఏ) ఆధ్వర్యంలో జులై 9 శనివారం గ్రేటర్‌ టొరంటో నగరంలోని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు పురస్కరించుకొని ధూం ధాం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఓక్విల్‌లోని హోలీ ట్రినిటీ సెకండరీ స్కూల్‌లో నిర్వహించిన ఈ వేడులకు భారీ సంఖ్యలో తెలంగాణ వాసులు పాల్గొన్నారు. ఈ సంబరాలను టీసీఏ కార్యదర్శి దామోదర్‌ రెడ్డి మాది ప్రారంభించగా.. విష్ణుప్రియ ఈద, కవిత తిరుమలాపురం, దీప గజవాడ, రజని మాది, వసంత రుద్రోజి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా టీసీఏ అధ్యక్షుడు రాజేశ్వర్‌ ఈద మాట్లాడుతూ.. తెలంగాణ కోసం టొరంటో నుంచి టీసీఏ ఆధ్వర్యంలో చేసిన కృషిని కొనియాడారు. ఫౌండేషన్‌ కమిటీ ఛైర్మన్‌ వేణు రోకండ్ల, ట్రస్టీ ఛైర్‌ సంతోష్‌ గజవాడ, వైస్‌ ప్రెసిడెంట్‌ మన్నెం శ్రీనివాస్‌, కల్చరల్‌ సెక్రటరీ కవితా తిరుమలాపురం ఆరంభ ప్రసంగంతో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ కార్యక్రమానికి నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కవిత వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. టీసీఏ కార్యవర్గ సభ్యులు, కెనడాలోని తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా కెనడా తెలంగాణ ప్రవాస భారతీయులు తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ రాష్ట్ర పురోగమనంలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ యాసను సినీ ప్రపంచానికి వాడకంలో తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు అతిథి తనికెళ్ల భరిణి వర్చువల్‌గా పాల్గొని టొరంటోలోని తెలంగాణ వాసులకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధీరజ్‌ ఫరీఖ్‌ కాన్సుల్‌ జనరల్‌ (వెల్ఫేర్‌), గెస్ట్‌ స్పీకర్‌గా ఒంటారియో రాష్ట్ర మెంబర్‌ ఆఫ్‌ ప్రొవెన్షియల్‌ పార్లమెంట్‌ (ఎంపీపీ) దీపక్‌ ఆనంద్‌ విచ్చేసి టీసీఏ వారు తెలంగాణ సంస్కృతిని భావితరాలకు అందించే విధానాన్ని అభినందించారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం తరఫున ప్రశంసాపత్రాన్ని బహూకరించారు.  అనంతరం ఫౌండేషన్‌ ఛైర్‌, ప్రెసిడెంట్‌లు పుష్పగుచ్ఛాలు, శాలువాలతో వారిని టీసీఏ స్టేజిపైనే సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా బోనాల ఊరేగింపుతో, తెలంగాణ మహా జాతర మేడారంలోని సమ్మక్క-సారలమ్మను చిలకల గుట్ట ద్వారా తీసుకువచ్చే విధానం, విజయ్‌కుమార్‌ తిరుమలాపురం, మూర్తి కలగోని డప్పు వాయిద్యాలతో చిన్నారులు జాతరను ప్రదర్శించిన తీరు సభికులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో ఎత్తరా జెండా (RRR సినిమా) పాటను 15 మంది చిన్నారులతో కనుల విందుగా ప్రదర్శించారు. ధీరజ్‌ బర్ల, లక్ష్మి సంధ్య నాడు-నేడు-రేపు కాన్సెప్ట్ పాటల లొల్లితో ధూం ధాంగా సభికులను ఉర్రూతలూగించారు. టీసీఏ వారు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను అక్కడి వారితోనే ఎంతో కలర్‌ఫుల్‌గా ఆర్గనైజ్‌ చేయడంపై పలువురు ప్రశంసలు కురిపించారు. ఈ సంబురాల్లో తెలంగాణ కెనడా అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు నవీన్‌ ఆకుల, ఉదయ్‌ భాస్కర్‌ గుగ్గిళ్ల (బోర్డు ఆఫ్‌ ట్రస్టీ), శ్రీనివాస్‌ రెడ్డి దేపా, రాజేశ్ అర్రా, ప్రకాశ్‌ చిత్యాల, మనోజ్‌ రెడ్డి, ఫౌండేషన్‌ కమిటీ సభ్యులు విజయ్‌ కుమార్‌ తిరుమలాపురం, కోటేశ్వరరావు చిత్తలూరి, శ్రీనివాస్‌ తిరునగరి, దేవేందర్‌ రెడ్డి గుజ్జుల పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాహుల్ బాలినేని, కుమారి ధాత్రి అంబటి వేడుకల మాస్టర్స్‌గా వ్యవహరించారు.  ఈ సందర్భంగా టీసీఏ వారు ఏర్పాటు చేసిన భోజనాలు సభికులకు ఆనందాన్ని కలిగించింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక తెలుగువారితో సుమారు నాలుగు గంటల పాటు ప్రదర్శించడం విశేషం. టీసీఏ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌ మన్నెం కృతజ్ఞత వందన సమర్పణతో ఈ వేడుకలు విజయవంతంగా ముగిశాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని