మహాకూటమి ఓటమికి కారణాలివే..!

బిహార్‌ ఎన్నికల్లో ఆర్జేడీ నేతృత్వంలో మహా కూటమికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. గత ఎన్నికల్లో ఆ కూటమికి విజయం వరించినా.. నీతీశ్‌ రెండేళ్లకే ఎన్డీయే పంచన.....

Updated : 11 Nov 2020 04:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బిహార్‌ ఎన్నికల్లో ఆర్జేడీ నేతృత్వంలో మహా కూటమికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. గత ఎన్నికల్లో ఆ కూటమికి విజయం వరించినా.. నీతీశ్‌ రెండేళ్లకే ఎన్డీయే పంచన చేరడంతో ప్రతిపక్షానికి చేరింది. తాజా ఎన్నికల్లో మహా కూటమిదే విజయం అని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసినప్పటికీ.. ఫలితాలొచ్చేసరికి సీన్‌ రివర్స్‌ అయ్యింది. దీంతో కూటమికి నేతృత్వం వహిస్తున్న ఆర్జేడీకి మళ్లీ నిరాశ ఎదురైంది. చిన్న వయసులోనే సీఎం పీఠం అధిరోహించాలన్న తేజస్వి కల చెదిరింది.

‘జంగిల్‌రాజ్‌’ మరక
బిహార్‌లోని లాలూ-రబ్రీదేవి పాలనను జంగిల్‌ రాజ్‌గా పిలుస్తుంటారు. కిడ్నాప్‌లు, యువతుల అపహరణ పెద్ద ఎత్తున జరగడంతో వారి పాలనా కాలానికి ఆ ముద్ర పడిపోయింది. దీంతో ఆర్జేడీ అధికారంలోకి వస్తే మళ్లీ జంగిల్‌ రాజ్‌ ఎక్కడొస్తోందనని ప్రజలు భయపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ సైతం తేజస్విని ‘జంగిల్‌ రాజ్‌కు యువరాజ్‌’ అని సంబోధించడం తెలిసిందే. దీంతో గతంలో పోలిస్తే ఆ పార్టీకి (80) సీట్లు పెరగకపోగా.. స్వల్పంగా తగ్గడం గమనార్హం.

కాంగ్రెస్‌ పట్ల ఉదారత

ఒకప్పుడు బిహార్‌ను పాలించిన కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి రోజు రోజుకూ తీసికట్టుగా మారుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 27 స్థానాలు సాధించినప్పటికీ ఈ సారి ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా ఆ పార్టీకి ఆర్జేడీ 70 స్థానాలు కేటాయించింది. 144 స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేసింది. ఫలితాలొచ్చేసరికి కాంగ్రెస్‌ పార్టీ 20 స్థానాలకే పరిమితమైంది. గతం కంటే 7 స్థానాలు కోల్పోయి కూటమి విజయావకాశాలను దెబ్బతీసింది.

ఉద్యోగాల హామీ ఫలించలేదా..?

బిహార్‌లో ఈ సారి ఎన్నికల్లో నిరుద్యోగం ప్రధాన అస్త్రంగా మారింది. మహా కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్‌ 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల హామీని తెరపైకి తేవడం ఎన్నికలకు ఊపునిచ్చింది. ప్రమాణ స్వీకారం రోజున దానిపైనే తొలి సంతకం చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే, అన్ని ఉద్యోగాలు ఇస్తే వారికి జీతభత్యాల కోసం బడ్జెట్‌లో నిధులు ఎలా కేటాయిస్తారన్న ప్రశ్న చదువుకునే వారిలో ఉత్పన్నమైంది. అందులోనూ తేజస్వి పెద్దగా చదువుకోకపోవడం (9వ తరగతి) దీన్ని యువత పెద్ద సంఖ్యలో విశ్వసించకపోవడం గమనార్హం.

ఎంఐఎం దెబ్బతీసిందా..?

ఈ సారి ఎన్నికల్లో ఎన్డీయే, మహా కూటమితో పాటు ఎంఐఎం, బీఎస్పీ, ఆర్‌ఎల్‌ఎస్పీ కలిసి.. గ్రాండ్‌ డెమొక్రటిక్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (జీడీఎష్‌ఎఫ్‌)గా ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఎంఐఎం ఈ ఎన్నికల్లో మహా కూటమి విజయావకాశాలను దెబ్బతీసింది. ముస్లిం ఓటు బ్యాంకును చీల్చింది. బిహార్‌లో ఇంతకుముందు ఒక్క స్థానం కూడా గెలుపొందని ఆ పార్టీ.. ఈ సారి ఏకంగా ఐదు స్థానాల్లో విజయం సాధించింది. ఆర్జేడీకి సంప్రదాయ ఓటు బ్యాంకులో యాదవులతో పాటు ముస్లింలు ఉన్నారు. ఐదు స్థానాల్లో మజ్లిస్‌ పార్టీ గెలుపొందడమే కాక.. మరిన్ని స్థానాల్లో ఆర్జేడీ ఓట్లను చీల్చింది. ఇవన్నీ మూకుమ్మడిగా మహాకూటమిని అధికారానికి దూరం చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని