పైలట్‌ వర్గం ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట

రాజస్థాన్‌ రాజకీయాలు గంట గంటకూ మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతున్నాయి. గతంలో రాజస్థాన్‌ స్పీకర్‌ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ ..

Updated : 24 Jul 2020 12:14 IST

రాజస్థాన్‌: రాజస్థాన్‌ రాజకీయాలు గంట గంటకూ మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతున్నాయి. తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ వర్గం ఎమ్మెల్యేలకు హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. అనర్హత పిటిషన్లపై యథాతథస్థితి కొనసాగించాలని రాజస్థాన్‌ హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రాజస్థాన్‌ స్పీకర్‌ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ .. తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ వేసిన పిటిషన్‌పై ఇవాళ తీర్పు వెలువడాల్సి ఉండగా.. ఆయన మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో కేంద్రాన్ని కూడా చేర్చాలని దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించిన రాజస్థాన్‌ హైకోర్టు .. విచారణను 15 నిమిషాల పాటు వాయిదా వేసింది. అనంతరం విచారణ కొనసాగించిన హైకోర్టు .. ఈ కేసు విచారణలో కేంద్రాన్ని కూడా చేర్చడంతో తుది తీర్పు ఆలస్యమయ్యే అవకాశముందని, అప్పటి వరకు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.

 సచిన్‌ పైలట్‌ వర్గీయుల తిరుగుబాటు నేపథ్యంలో కాంగ్రెస్‌ ఫిర్యాదు మేరకు రాజస్థాన్‌ స్పీకర్‌ 19 మంది రెబల్‌ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాల్‌ చేస్తూ సచిన్‌ పైలట్‌ వర్గం ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. తీర్పు ఇచ్చే వరకు తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోరాదని హైకోర్టు స్పీకర్‌కు సూచించింది. ఈ ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని రాజస్థాన్‌ శాసనసభ స్పీకర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. స్పీకర్‌ లేవనెత్తిన అంశాలపై సుదీర్ఘ విచారణ చేపడతామన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని