The Kashmir Files: ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ను భాజపా ప్రమోట్‌ చేస్తోంది అందుకే: సంజయ్‌ రౌత్‌

రాజకీయాల్లో లబ్ధికే ఈ చిత్రాన్ని భాజపా ప్రమోట్‌ చేస్తోందంటూ సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు.

Updated : 21 Mar 2022 04:11 IST

ముంబయి: కశ్మీరీ పండిట్ల జీవితంపై బాలీవుడ్‌ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి రూపొందించిన ‘ది కశ్మీర్ ఫైల్స్‌’ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి భాజపా పాలిత రాష్ట్రాలు పన్ను మినహాయింపు ఇచ్చాయి. ప్రధాని మోదీ సైతం దర్శకుడిని మెచ్చుకున్నారు. ఎలాంటి ముందస్తు ఆర్భాటం లేకుండా వచ్చిన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో.. అదే స్థాయిలో పార్టీల మధ్య చర్చకూ దారి తీసింది. రాజకీయాల్లో లబ్ధికే ఈ చిత్రాన్ని భాజపా ప్రమోట్‌ చేస్తోందంటూ శివసేన పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. ఈ మేరకు శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’లో వారం వారం వెలువడే తన కాలమ్‌లో భాజపాపై విరుచుకుపడ్డారు.

తాము అధికారంలోకి వస్తే కశ్మీరీ పండిట్లను తిరిగి రప్పిస్తామని చెప్పిన భాజపా హామీ ఏమైందని రౌత్‌ తన కాలమ్‌లో ప్రశ్నించారు. ఆర్టికల్‌ 370 రద్దయినా ఎందుకు జరగలేదని, ఈ వైఫల్యం ఎవరిది? అని నిలదీశారు. అలాగే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో కలుపుతామన్న హామీ ఏమైందన్నారు. ‘ది కశ్మీరీ ఫైల్స్‌’ చిత్రానికి ప్రధాని నరేంద్రమోదీనే ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకే భాజపా ఈ చిత్రాన్ని ప్రమోట్‌ చేస్తోందని విమర్శించారు. 

కశ్మీర్‌ ఫైల్స్‌ తీసిన దర్శకుడే గతంలో ‘ది తాష్కెంట్‌ ఫైల్స్‌’ రూపొందించారని, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి మరణానికి గాంధీ కుటుంబమే కారణమని ఆరోపించారని రౌత్‌ అన్నారు. తాజా చిత్రంలో వాస్తవాలు చూపించే క్రమంలో కశ్మీర్‌ పండిట్లతో పాటు ఇబ్బందులు పడిన సిక్కులు, ముస్లిములు గురించి విస్మరించారని పేర్కొన్నారు. కశ్మీరీ పండిట్లు కశ్మీర్‌ను వీడే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్నది భాజపా మద్దతు ఉన్న వీపీ సింగ్‌ ప్రభుత్వమేనని, భాజపా నేత జగ్మోహన్‌ గవర్నర్‌గా ఉన్నారని గుర్తుచేశారు. ఆ రోజు కశ్మీరీ పండిట్ల గురించి శివసేన వ్యవస్థపాకుడు బాల్‌ థాక్రే ఒక్కరే మాట్లాడారని రౌత్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని