Gujarat Election 2022: కాంగ్రెస్‌ హింసను ప్రోత్సహిస్తే.. భాజపా శాంతిని నెలకొల్పింది: అమిత్‌ షా

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ మద్దతుతోనే గతంలో గుజరాత్‌లో అల్లర్లు జరిగాయని ఆరోపించారు. భాజపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పూర్తిగా శాంతిని నెలకొల్పిందని అన్నారు.

Published : 26 Nov 2022 01:47 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో అల్లర్లకు పాల్పడిన అసాంఘిక శక్తులకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతుగా నిలిచిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా విమర్శించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఖేడా జిల్లాలోని మహుథాలో జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై అమిత్‌ షా విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్‌ మద్దతుతోనే గుజరాత్‌లో అసాంఘిక శక్తులు హింసను సృష్టించాయని ఆరోపించారు. 2002లో అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పామని, తర్వాత భాజపా ప్రభుత్వం రాష్ట్రంలో పూర్తిగా శాంతిని నెలకొల్పిందని అన్నారు. 

‘‘కాంగ్రెస్‌ పాలనలో గుజరాత్‌లో మతపరమైన అల్లర్లు తరచూ జరుగుతూ ఉండేవి. వేర్వేరు వర్గాల ప్రజలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేలా ప్రజలను కాంగ్రెస్‌ ప్రోత్సహించేది. అలా తమ ఓటు బ్యాంకును పెంచుకున్న కాంగ్రెస్‌ పార్టీ, రాష్ట్రంలోని అతిపెద్ద వర్గంగా ఉన్న ప్రజలకు అన్యాయం చేసింది. కానీ, తర్వాత అధికారంలోకి వచ్చిన భాజపా హింసకు పాల్పడేవారికి సరైన గుణపాఠం నేర్పింది. మా పార్టీ అధికారంలోకి వచ్చాక హింసను ప్రేరేపించే వారిపై కఠిన చర్యలు చేపట్టి, రాష్ట్రంలో శాంతిని నెలకొల్పింది’’ అని షా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు కూడా ప్రధాని మోదీ సాహసోపేత నిర్ణయమన్న షా, ఆ సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిందని విమర్శించారు. 

ఈ దఫా గుజరాత్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఐదోసారి అధికారాన్నినిలబెట్టుకోవాలని భాజపా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెలకొల్పాలని ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు ఆప్‌ సైతం అధికారాన్ని కైవసం చేసుకోవాలని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. ప్రముఖంగా ఈ మూడు పార్టీల మధ్యే ప్రధాన పోరు ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డిసెంబరు 1, 5వ తేదీల్లో రెండు విడతల్లో రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. డిసెంబరు 8న ఫలితాలను వెల్లడించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని