CPI: రూ.200కోట్ల స్థలం.. కబ్జాదారుల నుంచి కాపాడండి: జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ

అనంతపురం నగరం నడిబొడ్డున ఉన్న సుమారు రూ.200కోట్ల విలువైన మిస్సమ్మ కాంపౌండ్‌ (సీఎస్‌ఐ) స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. 

Published : 19 May 2023 13:17 IST

అమరావతి: అనంతపురం నగరం నడిబొడ్డున ఉన్న సుమారు రూ.200కోట్ల విలువైన మిస్సమ్మ కాంపౌండ్‌ (సీఎస్‌ఐ) స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. 

‘‘7.67 ఎకరాల సీఎస్‌ఐ చర్చి స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసేందుకు 2007 నుంచి బీఎన్‌ఆర్‌ సోదరులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆయా భూముల్లో నివాసముంటున్న పేదలు, విద్యాసంస్థలను ఖాళీ చేయించేందుకు పలుమార్లు దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో పాటు కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో బీఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. 

బీఎన్‌ఆర్‌ సోదరులు సృష్టించిన దొంగపత్రాలను రద్దు చేయాలని ‘చర్చ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా’ వారు కోర్టులో కేసు వేశారు. కోర్టు నుంచి తుదితీర్పు వెలువడే వరకు ఆయా భూముల్లో ఎలాంటి చట్ట విరుద్ధమైన అక్రమ కట్టడాలు జరకుండా సంబంధిత రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. ఈ విషయంలో స్థానిక ప్రజలు, విద్యాసంస్థలకు రక్షణ కల్పించేలా పోలీసు అధికారులను ఆదేశించండి’’ అని సీఎంకు రాసిన లేఖరలో రామకృష్ణ పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని