
చేతకాదా చెప్పండి రాజధాని మేం కడతాం!
రాజధాని గ్రామాల్లో మిలటరీ పాలన నడుస్తోందంటూ నారాయణ ఆగ్రహం
హైదరాబాద్: రాజధాని అమరావతి ఆంధ్రుల హక్కు అని సీపీఐ జాతీయ సమితి కార్యదర్శి కె.నారాయణ అన్నారు. అమరావతిలో జరుగుతున్న రైతుల ఆందోళనలకు తమ పార్టీ సంఘీభావం ప్రకటించినట్లు తెలిపారు. రాజధాని తరలింపు ప్రకటన నేపథ్యంలో అమరావతి 29 గ్రామాల్లో మిలటరీ పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. హైదరాబాద్ హిమాయత్నగర్లోని ముగ్దూం భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఎన్ఆర్సీ తరహాలో ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల పేరిట రాష్ట్ర ప్రభుత్వం అలజడి సృష్టించిందని నారాయణ వ్యాఖ్యానించారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి రాజధాని నిర్మించలేనని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే రూ.4 లక్షల కోట్ల బడ్జెట్ అయినా సరిపోదంటూ నారాయణ ఎద్దేవా చేశారు. తల ఒక చోట.. మొండెం మరో చోట అంటే కుదరదన్నారు. అమరావతిలో 12.5 వేల ఎకరాల భూమిని అభివృద్ధికి ఇస్తే పైసా ఖర్చు చేయకుండా అద్భుతమైన రాజధానిని నిర్మించవచ్చని నారాయణ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి చేతకాకపోతే ఆ బాధ్యత తమకు అప్పగిస్తే రాజధాని కట్టిచూపుతామని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, నేతలు అజీజ్ పాషా, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement