Mallikarjun Kharge: దీటైన వ్యూహాలతో ఇంట గెలిచిన మల్లికార్జున ఖర్గే

మొన్న హిమాచల్‌ప్రదేశ్‌...నేడు కర్ణాటక... ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో లభించిన విజయం... కాంగ్రెస్‌కే కాదు...ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రతిష్ఠను కూడా పెంచిందనడంలో ఎలాంటి సందేహం లేదు! ముఖ్యంగా ఖర్గే సొంత రాష్ట్రమైన కన్నడనాట లభించిన భారీ గెలుపునకు మరెన్నో ప్రత్యేకతలూ ఉన్నాయి.

Updated : 14 May 2023 09:29 IST

కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడి ప్రతిష్ఠ పెంచిన కర్ణాటక గెలుపు

దిల్లీ: మొన్న హిమాచల్‌ప్రదేశ్‌...నేడు కర్ణాటక... ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో లభించిన విజయం... కాంగ్రెస్‌కే కాదు...ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రతిష్ఠను కూడా పెంచిందనడంలో ఎలాంటి సందేహం లేదు! ముఖ్యంగా ఖర్గే సొంత రాష్ట్రమైన కన్నడనాట లభించిన భారీ గెలుపునకు మరెన్నో ప్రత్యేకతలూ ఉన్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి సొంత రాష్ట్రంలో ఆ పార్టీ అఖండ విజయం సాధించడం సుమారు గత నాలుగు దశాబ్దాల్లో ఇదే తొలిసారి. ఇందిరాగాంధీ హత్యానంతరం పార్టీ పగ్గాలు చేపట్టిన రాజీవ్‌గాంధీ నేతృత్వంలో 1985లో ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 425 అసెంబ్లీ స్థానాలకు గాను 269 సీట్లలో కాంగ్రెస్‌ గెలుపొందింది. ఆ తర్వాత ఇప్పుడు ఖర్గే నేతృత్వంలో కర్ణాటకలో హస్తం పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసింది.

మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే గత ఏడాది డిసెంబరులో గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీల ఎన్నికలు జరిగాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ సత్తా చాటింది. గుజరాత్‌లో ఓటమి పాలైంది. సమయం తక్కువగా ఉండడంతో తనదైన మార్కును చూపటానికి, వ్యూహాల అమలుకు ఆ ఎన్నికల్లో ఖర్గేకు అవకాశం లభించలేదు. అయితే, తన సొంత రాష్ట్రమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్గే తన వ్యూహాన్ని అమలు చేయగలిగారు. రాష్ట్ర పార్టీ నాయకులను ఏకతాటిపై నడిపించడంతో పాటు కర్ణాటక ఓటర్ల దృష్టిని ఆకట్టుకోగలిగారు. కన్నడ భూమి పుత్రుడిని జాతీయాధ్యక్షుడిగా ఎన్నుకున్న కాంగ్రెస్‌ పార్టీని, తనను గర్వపడేలా చేయాలంటూ భావోద్వేగమైన అభ్యర్థనలను ఖర్గే చేశారు. అదే సమయంలో ప్రధాని మోదీని దీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. రాహుల్‌, ప్రియాంకా గాంధీలతో కలిసి కర్ణాటక ఎన్నికల ప్రచార బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు. రాష్ట్ర నాయకులైన సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ కేంద్రంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరిగినప్పటికీ దానికి మరింత ఊపును తీసుకురావడానికి ఖర్గే దోహదపడ్డారు.

రాజీవ్‌గాంధీ హత్యానంతరం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడైన పీవీ నరసింహరావు హయాంలో 1994లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమిపాలైంది. 1998లో సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలైన తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీకి 2002, 2007, 2012, 2017లలో నిర్వహించిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ బలహీనపడుతూ వచ్చిందే కానీ గెలుపొందలేదు. సోనియా గాంధీ రెండోసారి కాంగ్రెస్‌ సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఓటమి తప్పలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని