ఎమ్మెల్యే నిమ్మల అరెస్టు

పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ పరిధి పెరుగులంక భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్నందుకు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.

Published : 07 Jun 2023 03:37 IST

పెరుగులంక భూముల్లో అక్రమ మట్టి తవ్వకాల అడ్డగింత
నిరసనకారులను ఈడ్చుకెళ్లిన పోలీసులు

పాలకొల్లు పట్టణం, యలమంచిలి, గణపవరం, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ పరిధి పెరుగులంక భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్నందుకు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. గత రెండు రోజులుగా స్థానికులతో కలిసి ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో మట్టి తరలిస్తున్నారని తెలిసి సోమవారం రాత్రి పెరుగులంకలోనే నిద్రపోయారు. మంగళవారం ఉదయం నియోజకవర్గం పని మీద బయటకు వెళ్లి మధ్యాహ్నానికి తిరిగి వచ్చిన ఆయనను పెరుగులంక భూముల్లోకి వెళ్లకుండా డీఎస్పీ మనోహరాచారి తమ సిబ్బందితో అడ్డుకున్నారు. ఇరువురి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే మీద దౌర్జన్యం ఏమిటి? నన్ను కాల్చేస్తారా..? నన్ను నియోజకవర్గంలో తిరగనివ్వరా అంటూ డీఎస్పీపై అసహనం వ్యక్తం చేశారు. తన కారులో ఉన్న ఎమ్మెల్యే రామానాయుడును పోలీసులు దౌర్జన్యంగా దించి బలవంతంగా పోలీస్‌ వాహనంలోకి ఎక్కించారు. దళితులు, సీపీఎం, సీపీఐ, తెదేపా నాయకులుఅడ్డుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా నిరసనకారులను జీపులోకి ఎక్కించేటప్పుడు పోలీసులు పిడిగుద్దులు గుద్దడం, కారులో కుక్కడంతో పలువురు గాయపడ్డారు. రోడ్డుకు అడ్డంగా కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను పురుష పోలీసులు లాక్కెళ్లి వాహనాల్లో ఎక్కించారు. ఈ క్రమంలో గాయాలైన నిరసనకారులను 60 కి.మీ.కు పైగా దూరం ఉన్న తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం గమనార్హం. కొంతమంది నిరసనకారులను తాడేపల్లిగూడెం పోలీస్‌స్టేషన్‌కు, శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడును గణపవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉండి ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు, ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు గణపవరం స్టేషన్‌కు వచ్చి నిమ్మలకు సంఘీభావం తెలిపారు. రామానాయుడును విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 3గంటల పాటు స్టేషన్లో ఉన్న ఎమ్మెల్యేకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి విడుదల చేశారు. తాడేపల్లిగూడెంలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, సీపీఎం నాయకుడు చింతకాయల బాబురావు పరామర్శించారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ తాడేపల్లిగూడెం గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ వద్ద ధర్నా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని