పంద్రాగస్టులోపు రుణమాఫీ

కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో మరో రెండింటిని త్వరలో అమలు చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీలోపు రైతులకు రూ.2 లక్షల మేర రుణమాఫీ చేస్తామని, వరి ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్‌ను వచ్చే సీజన్‌ నుంచి ఇస్తామని తెలిపారు.

Updated : 16 Apr 2024 03:33 IST

ఏకకాలంలో రూ.2 లక్షలు రద్దు చేసే బాధ్యత నాది..
వచ్చే సీజన్‌ నుంచి వరికి రూ.500 బోనస్‌
ఇందిరమ్మ కమిటీలతోనే పథకాలకు లబ్ధిదారుల ఎంపిక
ప్రధాని మోదీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం
ఐదు ఎంపీ సీట్లలో భారాస ఓట్లు భాజపాకు వేసేలా అవగాహన
కవిత బెయిల్‌ కోసం తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు
నారాయణపేట బహిరంగసభలో సీఎం రేవంత్‌రెడ్డి
ఈనాడు - హైదరాబాద్‌

కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో మరో రెండింటిని త్వరలో అమలు చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీలోపు రైతులకు రూ.2 లక్షల మేర రుణమాఫీ చేస్తామని, వరి ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్‌ను వచ్చే సీజన్‌ నుంచి ఇస్తామని తెలిపారు. నారాయణపేటలో సోమవారం సాయంత్రం జరిగిన ‘జనజాతర’ బహిరంగసభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘ఎన్నికల కోడ్‌ రావడంతో రైతు రుణమాఫీని అమలు చేయలేకపోయాం. రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతాంగానికి నారాయణపేట గడ్డ మీది నుంచి నేను మాట ఇస్తున్నా.. ఆగస్టు 15వ తేదీ లోపల రూ.2 లక్షల రైతు రుణమాఫీని అమలుచేసి తీరుతా. రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేసినట్లుగానే.. రైతులకు రుణమాఫీని ఏకకాలంలో, ఏకమొత్తంలో అమలు చేసే బాధ్యత నాది. వరికి రూ.500 బోనస్‌ ఇస్తామని చెప్పాం.. వచ్చే సీజన్‌ నుంచి దీన్ని అమలు చేస్తాం. ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం’ అని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మహబూబ్‌నగర్‌లో వంశీచంద్‌రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీఎం తన ప్రసంగంలో అటు భాజపా, ఇటు భారాసలను దుయ్యబట్టారు. ‘జైల్లో ఉన్న బిడ్డ కవితను కాపాడుకునేందుకు కేసీఆర్‌.. ప్రధాని మోదీతో చీకటి ఒప్పందం చేసుకుని, సుపారీ తీసుకున్నారు. భారాస ఆత్మగౌరవాన్ని మోదీ దగ్గర కేసీఆర్‌ తాకట్టు పెట్టారు. మహబూబ్‌నగర్‌, చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి, జహీరాబాద్‌.. ఈ ఐదూ కాంగ్రెస్‌ పార్టీ గ్యారంటీగా గెలిచేవి. ఈ నియోజకవర్గాల్లో భారాస ఓట్లు భాజపాకు వేయాలని చెబుతున్నారు. భారాస నేతలు తమ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడం లేదు. వంద రోజులు పాలించిన రేవంత్‌రెడ్డిని గద్దె దించమంటున్న కేసీఆర్‌.. పదేళ్లు అధికారంలో ఉన్న మోదీని దించాలని ప్రజల్ని ఎందుకు కోరడం లేదు? నేను ఒక్కరోజు కూడా సెలవుపెట్టలేదు. కష్టపడి పనిచేస్తున్నా. రేవంత్‌రెడ్డిని దెబ్బతీయాలని భారాస ఆలోచిస్తోంది. పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారు. కేసీఆర్‌ తర్వాత ఆయన కుమారుడు.. వారి బిడ్డలే ముఖ్యమంత్రి కావాలా? మాకు ఏం తక్కువ? నాపై కోపం ఉంటే నాతో కొట్లాడాలి. ధైర్యం ఉంటే గ్రామాలకు వచ్చి ఓట్లు అడగాలి.

గద్వాల కోటలో కుతంత్రం

అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల కోటలో కుతంత్రం చేసి.. భారాస, భాజపా ఒప్పందం చేసుకున్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి సరితమ్మను ఓడించారు. అరుణమ్మ నాయకత్వంలో భాజపా ఓట్లన్నీ భారాసకు వేసి కాంగ్రెస్‌ అభ్యర్థిని ఓడించారు. సరితమ్మ గెలిచి ఉంటే యాదవ బిడ్డ మంత్రి అయ్యేవారు. లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ భాజపా అభ్యర్థిని గెలిపించేందుకు భారాస ప్రయత్నిస్తోంది. భారాస అభ్యర్థి ఎక్కడున్నారో తెలియదు. ఈ లోక్‌సభ పరిధిలోని ఏడుగురు భారాస మాజీ ఎమ్మెల్యేలు ప్రచారం చేయట్లేదు. రేవంత్‌ను ఓడించాలని, మోదీని మరోసారి ప్రధానిని చేయాలంటున్న డీకే అరుణను నేను ప్రశ్నిస్తున్నా. మోదీ నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 10 పైసల నిధులు, జాతీయ హోదా తెప్పించారా? కృష్ణా-వికారాబాద్‌ రైల్వే లైన్‌ గురించి మాట్లాడారా? పాలమూరు నుంచి లక్షల మంది వలస పోతుంటే పట్టించుకోలేదు. కాంగ్రెస్‌ 100 రోజుల పాలనలో.. 35 కోట్ల మంది ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం అమలు చేసినందుకు ఓడించాలా? పేదలకు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినందుకు ఓడించాలా? ఆడబిడ్డలకు రూ.500కే ఉచిత సిలిండర్‌ ఇచ్చినందుకా? పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నందుకు ఓడించాలా? కాంగ్రెస్‌ హయాంలో రూ.400 ఉన్న సిలిండర్‌ ధరను మోదీ రూ.1,200కు పెంచినందుకు భాజపాకు ఓటేయాలా? ఈ మట్టి నాది, గాలి నాది. ప్రజల కష్టం నాది అనుకుని మీ కష్టాలు తీరుస్తా. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే మహబూబ్‌నగర్‌లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.500కు సిలిండర్‌ పథకాలను అమలు చేస్తాం. ఇంటికో ఉద్యోగమిస్తామని కేసీఆర్‌ ఇవ్వలేదు. తన కుటుంబసభ్యులకు పదవులు ఇచ్చుకున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలిచ్చి నిరుద్యోగుల కళ్లల్లో ఆనందం చూశాం.

ముదిరాజ్‌ బిడ్డను మంత్రిని చేస్తా

ఆగస్టు లోపు ముదిరాజ్‌ బిడ్డను రాష్ట్రంలో మంత్రిని చేస్తాం. మెదక్‌లో నీలం మధును, మహబూబ్‌నగర్‌లో వంశీచంద్‌ను గెలిపించండి.. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌నే గెలిపించండి. 10 శాతం జనాభా ఉన్న ముదిరాజ్‌లకు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ ఒక్క టికెట్‌ కూడా ఇవ్వలేదు. బీసీ- డి గ్రూప్‌ నుంచి ‘ఏ’కి ముదిరాజ్‌లను మార్చే రిజర్వేషన్ల కేసు సుప్రీంకోర్టులో ఉంది. కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్లే కేసు పెండింగ్‌లో ఉంది. ముదిరాజ్‌లు ఆలోచించాలి. మెదక్‌లో నీలం మధుకు కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చింది. కేసీఆర్‌ మాత్రం వెంకట్రామిరెడ్డికి ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి. మీ తరఫున దిల్లీలో కొట్లాడేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలి.

ఇందిరమ్మ కమిటీలు నియమిస్తాం

ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే నారాయణపేట ఎత్తిపోతల పథకానికి నిధులు విడుదల చేశాం. కృష్ణా-వికారాబాద్‌ రైల్వే లైన్‌ని భారాస ప్రభుత్వం పదేళ్లు పక్కనపెడితే.. మేం రైల్వే అధికారుల్ని రప్పించి ముందుకు తీసుకెళుతున్నాం. నారాయణపేటకు అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ఇచ్చే బాధ్యత నాది. లోక్‌సభ ఎన్నికలు కాగానే.. రెండు నెలల లోపే స్థానిక ఎన్నికలు వస్తాయి. వీటిని నిర్వహించి, పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత నాది. కష్టపడేవారికే అవకాశాలిస్తాం. కార్యకర్తల శ్రమ ఊరికే పోదు. ఇందిరమ్మ కమిటీల్లో వారిని నియమిస్తాం. మీ ద్వారా పేదలకు పథకాలు అమలు చేస్తాం. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ రెండు ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌ గెలవాలి. కాంగ్రెస్‌ కార్యకర్తల కృషి, ప్రజల ఆశీర్వాదంతో ఉమ్మడి పాలమూరులో 14కు 12 అసెంబ్లీ సీట్లు సాధించి పార్టీ అధికారంలోకి వచ్చింది. కార్యకర్తల కృషి వల్లే నేను సీఎంను అయ్యా. కానీ కాంగ్రెస్‌, భాజపాలు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయి. కాంగ్రెస్‌ కార్యకర్తలు పెంచిన చెట్టును నరికేందుకు దిల్లీ నుంచి ఒకరు, గజ్వేల్‌ ఫాంహౌస్‌ నుంచి ఒకరు బయల్దేరారు. మీరు పెంచిన చెట్టును కాపాడుకోవాలి. మీరు సిద్ధమేనా? కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది. ఎమ్మెల్యే  ఎన్నికలకు కంటే ఎక్కువ కష్టపడాలి. ఏమరుపాటుగా ఉంటే నష్టం’.. అంటూ పార్టీ శ్రేణులకు రేవంత్‌రెడ్డి ఉద్బోధించారు. ఈ సభలో అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పర్నికారెడ్డి, వాకిటి శ్రీహరి, వీర్లపల్లి శంకర్‌, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, గద్వాల జడ్పీ ఛైర్‌పర్సన్‌ సరిత, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, నారాయణపేట నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి శివకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


స్సీ వర్గీకరణ విషయంలో కేసీఆర్‌ పదేళ్లు నిర్లక్ష్యం చేశారు. అసెంబ్లీలో ఈ విషయంపై పోరాడితే.. నన్ను, సంపత్‌కుమార్‌ను కేసీఆర్‌ సభ నుంచి బయటకు పంపించారు. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే లక్ష్మణ్‌ను విప్‌గా నియమించాం. పాల్వాయి రజనీని టీఎస్‌పీఎస్సీ సభ్యురాలిగా, నా పేషీలో అధికారిగా సంగీతను నియమించాం. మాదిగల ఆవేదన నాకు తెలుసు. కాంగ్రెస్‌ నియామకాల్లో మాదిగలకు న్యాయం చేసి సముచిత బాధ్యత కల్పిస్తా. సోనియాను ఒప్పించి ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటులో చట్టం చేసే బాధ్యత కాంగ్రెస్‌ తీసుకుంటుంది.

 సీఎం రేవంత్‌ రెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని