భాజపా, జనసేన ధర్మపరిరక్షణ దీక్ష

తూర్పుగోదావరి జిల్లా అతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి  దివ్యరథం దగ్ధమైన ఘటనను నిరసిస్తూ జనసేన, భాజపా ఆందోళనబాట పట్టాయి.

Updated : 10 Sep 2020 13:16 IST

హైదరాబాద్‌: తూర్పుగోదావరి జిల్లా అతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి  దివ్యరథం దగ్ధమైన ఘటనను నిరసిస్తూ జనసేన, భాజపా ఆందోళనబాట పట్టాయి. రెండు పార్టీల నేతలు సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌లోని తన నివాసంలో ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టారు. దీక్షకు ముందు జనసేన ముఖ్య నాయకులతో చర్చించారు.

దిల్లీలో జీవీఎల్‌ దీక్ష

అంతర్వేది ఘటనపై సీఎం న్యాయ విచారణ జరిపించాలని భాజపా జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు డిమాండ్‌ చేశారు. అంతర్వేది ఘటనకు నిరసనగా దిల్లీలోని తన నివాసంలో లక్ష్మీనరసింహస్వామికి పూజలు చేసి నిరసన దీక్షలో కూర్చున్నారు.  అరెస్టు చేసిన భాజపా, జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. జీవీఎల్‌తో పాటు ఆ పార్టీ నేతలు సునీల్‌ దేవధర్‌, సత్యకుమార్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు.

 

హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు...

పెద్దవాల్తేరు: హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని శాసన మండలి సభ్యుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. గురువారం విశాఖలోని భాజపా కార్యాలయంలో అంతర్వేది ఘటనకు నిరసనగా దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇప్పటి వరకు పలు దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. హిందూ దేవాలయాలకు వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఆదాయంగా భావిస్తున్నారన్నారని ఆరోపించారు. మసీదులు, చర్చిలకు వచ్చే ఆదాయాలు ఆ మతస్థులు మాత్రమే వినియోగించుకుంటున్నారని తెలిపారు. అలాంటప్పుడు హిందూ  దేవాలయాలను రక్షించాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. అంతర్వేది ఘటనకు సంబంధించి   ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. దేవాలయ భూముల విక్రయం, వాటిని ప్రైవేటు వ్యక్తులకు లీజులకు ఇచ్చే చర్యలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అన్య మతాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. అంతర్వేదిలో రథం దగ్ధం చేయడాన్ని ప్రభుత్వం పిచ్చివాడి చర్యగా చెబుతోందని,  అక్కడి  కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌ కూడా అలాగే నివేదికలు ఇవ్వడం శోచనీయమన్నారు. మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు, జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు ఎం.రవీంద్ర తదితరులు దీక్షలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని