Kishan reddy: రాజ్యాంగం ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన: కిషన్‌రెడ్డి

డీలిమిటేషన్ రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని.. ఇప్పటికిప్పుడు జరుగుతుందని చెప్పలేమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

Updated : 31 May 2023 19:17 IST

దిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్‌ గోల్కొండ కోటలో జూన్ 2, 3 తేదీల్లో కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రెండ్రోజుల కార్యక్రమాల వివరాలను మంత్రి మీడియాకు వెల్లడించారు. వివిధ రాష్ట్రాల రాజ్‌భవన్‌లలో కూడా  తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుతున్నట్టు తెలిపారు. రానున్న రోజుల్లో అన్ని రాష్ట్రాల ఆవిర్భావ వేడుకలను దేశ వ్యాప్తంగా ఉన్న రాజ్‌భవన్లలో జరపనున్నట్టు వెల్లడించారు. 

లక్షలాది మంది తెలంగాణ కోసం ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారు కాబట్టే తెలంగాణ సాకారం అయ్యిందన్న కిషన్‌రెడ్డి .. భాజపా చిన్న రాష్ట్రాలకు అనుకూలమని పునరుద్ఘాటించారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం రంగాల వారీగా గత 9ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో ప్రకటిస్తామని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం  కేంద్రం అనేకసార్లు సమావేశాలు నిర్వహించిందని, సామరస్యపూర్వకంగానే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. దిల్లీ ఏపీ భవన్‌ విభజనపై చర్చలు జరుగుతున్నట్టు చెప్పారు. 

భాజపాలో చేరిన వారు ఎవరూ బయటకి వెళ్లరన్న కిషన్‌రెడ్డి ..భారాస, కాంగ్రెస్‌ కుట్రలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. తెలంగాణలో భాజపా మరింత బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో నాయకులు చేరితే ప్రభుత్వాలు ఏర్పడవన్న ఆయన.. ప్రజలు మార్పు కోరుకుంటేనే ప్రభుత్వాలు ఏర్పడతాయని వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత డీలా పడలేదని, భాజపా నిరాశ, నిస్పృహకి లోనయ్యే పార్టీ కాదన్నారు. అనేకమంది నాయకులు కొత్తగా భాజపాలో చేరబోతున్నట్టు చెప్పారు.  ప్రధాని మోదీకి నార్త్‌, సౌత్‌ అని తేడా ఉండదన్నారు. నార్త్‌, సౌత్‌ అంటూ విభేదాలు సృష్టించవద్దని కోరారు. భాజపా జాతీయ భావజాలంతో పనిచేస్తుందన్నారు. డీలిమిటేషన్ రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని.. ఇప్పటికిప్పుడు జరుగుతుందని చెప్పలేమన్నారు. రాజ్యాంగం ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందనడం సరికాదన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని