KTR: మల్కాజిగిరిలో తేల్చుకుందాం.. సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ సవాల్‌

సీఎం రేవంత్‌రెడ్డికి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ సవాల్‌ విసిరారు.

Updated : 29 Feb 2024 21:20 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు అయినా గెలిచి చూపించాలని భారాసకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరిన నేపథ్యంలో.. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) స్పందించారు. ‘‘మీకు ధైర్యముంటే సీఎం, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయండి.. నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఇద్దరం కలిసి మల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేసి తేల్చుకుందాం’’ అని ప్రతి సవాల్‌ విసిరారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ముందు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆడబిడ్డలకు రూ.2,500 సహా ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని హితవు పలికారు.

‘‘మాది మేనేజ్‌మెంట్‌ కోటా అయితే.. రాహుల్‌,  ప్రియాంకా గాంధీది ఏం కోటా? రేవంత్‌ది పేమెంట్‌ కోటానా? అలా సీటు తెచ్చుకున్నందుకు రేవంత్‌.. దిల్లీకి పేమెంట్‌ చేయాలి. బ్యాగులు మోయాలి. ఇందుకోసం బిల్డర్లు, వ్యాపారులను బెదిరించాలి. అందుకే భవన నిర్మాణ అనుమతులు ఆపారు. ఇప్పటివరకు ఎన్ని అనుమతులు ఇచ్చారో చెప్పాలి. త్వరలో బిల్డర్లు, వ్యాపారులు రేవంత్‌ తీరును వ్యతిరేకిస్తూ రోడ్డు ఎక్కుతారు. ఆయనే సీఎం అని ఎన్ని సార్లు చెబుతారు. ఆయనకు తానే సీఎం అన్న నమ్మకం లేదా? మా ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు. పాలనలో అన్నీ సీఎం, మంత్రులకు తెలియాలని లేదు. తప్పులు జరిగాయనుకుంటే విచారించి చర్యలు తీసుకోండి’’ అని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని