AP News: ఎవరి అంతరాత్మ ఎలా ప్రబోధిస్తుందో?.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.7 ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికలను తెదేపా, వైకాపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated : 22 Mar 2023 18:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఉత్కంఠగా మారింది. ఇప్పటికే 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుని మాంచి జోష్ మీదున్న తెలుగుదేశం పార్టీ.. ఎమ్మెల్యే కోటాలో అవకాశమున్న ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేసే ఎమ్మెల్యేలతో తమ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుస్తుందని తెదేపా విశ్వాసం వ్యక్తం చేస్తోంది. మూడు పట్టభద్రుల స్థానాలను పోగొట్టుకున్న వైకాపా ఎలాగైనా 7 ఎమ్మెల్సీ స్థానాలను చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించింది. విప్‌ లేకుండా జరిగే రహస్య బ్యాలెట్‌లో ఏ ఓటు ఎవరికి పడుతుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. గురువారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు అసెంబ్లీ కమిటీ హాలులో జరిగే పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

క్రాస్‌ ఓటింగ్‌పైనే తెదేపా ఆశలు..

అధికార వైకాపాకు సాంకేతికంగా 6 స్థానాలు మాత్రమే గెలుచుకునే బలం ఉన్నా 7 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. అసంతృప్తి ఎమ్మెల్యేలపై నిఘా పెట్టి క్రాస్‌ ఓటింగ్‌ చేస్తారనే అనుమానం ఉన్న వారి జాబితా తయారు చేసుకుని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. తెదేపాకు సాంకేతికంగా ఒక స్థానం గెలుచుకునే అవకాశం ఉన్నా.. నైతిక మద్దతు లేని కారణంతో తటపటాయిస్తూనే తమ అభ్యర్థిగా బీసీ మహిళ అనురాధను ఎన్నికల బరిలో నిలబెట్టింది. ఈ ఎన్నికకు సంబంధించి మొత్తం సభ్యుల సంఖ్యను ఖాళీ స్థానాలకు అదనంగా ఒకటి జోడించి భాగించాల్సి ఉంది. ఈ లెక్కన మొత్తం శాసనసభ్యులన్న 175 సంఖ్యను 8తో భాగిస్తే ఒక్కో అభ్యర్థి గెలుపుకోసం 22 మొదటి ప్రాధాన్యం ఓట్లు అవసరం. ఏ ఇద్దరు అభ్యర్థులైనా 22 మొదటి ప్రాధాన్యం ఓట్లు లోపే ఆగిపోతే అప్పుడు రెండవ ప్రాధాన్యం ఓట్లు కీలకం కానున్నాయి. తెలుగుదేశం అభ్యర్థికి రెండో ప్రాధాన్యం ఓట్లు పడే అవకాశం లేకపోవడం అధికార పార్టీకి కలిసొచ్చే అంశం. కానీ, అధికార పార్టీ నుంచి ఒక్కటైనా క్రాస్‌ ఓటింగ్‌ జరిగితే మాత్రం తెదేపా అభ్యర్థి గెలుపు లాంఛనమే.

అసెంబ్లీలో బలాబలాలు ఇలా..

అసెంబ్లీలో పార్టీల బలాబలాలను చూస్తే అధికార వైకాపాకు 151 మంది సభ్యుల బలం ఉంది. ఈ బలం ఆరుగురు సభ్యులను మాత్రమే గెలిపించుకునేందుకు సాధ్యపడుతుంది. 2019 ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్‌లు వైకాపాలో చేరారు. వీరితో పాటు జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్‌ కూడా వైకాపాతోనే ఉన్నారు. దీంతో తమకు నైతికంగా 156 మంది సభ్యుల బలం ఉందని వైకాపా చెబుతోంది. అయితే, అధికార వైకాపాను అసంతృప్తి ఎమ్మెల్యేల ముసలం వేధిస్తోంది. ఆ పార్టీ నుంచి గెలుపొందిన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిలు గత కొంతకాలంగా ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తామని ఇద్దరూ బహిరంగంగానే స్పష్టం చేశారు. దీంతో అధికార వైకాపాలో అలజడి మొదలైంది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వైకాపాకు ఓటు వేయకుంటే ఆ పార్టీకి మిగిలే బలం 154. ఆ మొత్తం సభ్యులు కచ్చితంగా అధికార పార్టీ నిలబెట్టిన ఏడుగురు సభ్యులకు ఒక్కొక్కరూ 22 ఓట్లు వేసేందుకు సరిపోతుంది. ఇక్కడే అధికార పార్టీని క్రాస్‌ ఓటింగ్‌ భయం వెంటాడుతోంది. గురువారం పోలింగ్‌ నేపథ్యంలో బుధవారం రాత్రి ఎమ్మెల్యేలందరితో వైకాపా విందు భేటీ నిర్వహిస్తున్నట్టు సమాచారం. 

క్రాస్‌ ఓటింగ్‌ పైనే తెదేపా ఆశలు..

ఇప్పటికే 3 సార్లు మాక్‌ పోలింగ్‌ నిర్వహించినా 132 మందికి మించి వైకాపా సభ్యులు హాజరుకాకపోవటం, హాజరైనా వారిలోనూ నలుగురు ఎమ్మెల్యేలు చెల్లని ఓట్లు వేయడం వంటి పరిణామాలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. దీంతో 154 మంది వైకాపా ఎమ్మెల్యేలను ఏడు బృందాలుగా విభజించి ఒక్కో బృందానికి 22 మందిని కేటాయించి ప్రతి బృందానికి ఇద్దరు, ముగ్గురు మంత్రుల పర్యవేక్షణ ఉండేలా జాగ్రత్తపడుతోంది. అంతరాత్మ ప్రభోదానుసారం ఓటెయ్యాలంటూ తెదేపా ఇస్తున్న పిలుపునకు అనుగుణంగా పలువురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తారనే అనుమానం అధికార పార్టీకి లేకపోలేదు. రహస్య ఓటింగ్ కారణంగా తమ అభ్యర్థి గెలుపు ఖాయమని తెలుగుదేశం ధీమా వ్యక్తం చేస్తోంది. 

అధికార పార్టీ నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరైనా లేక, చెల్లని ఓటు వేసినా తెలుగుదేశం పార్టీకి వచ్చే లాభం ఏమీ లేకపోవటంతో క్రాస్‌ ఓటింగ్‌పైనే ఆ పార్టీ నమ్మకం పెట్టుకుంది. తమ పార్టీలో ప్రస్తుతం ఉన్న 19 మంది ఎమ్మెల్యేలు ఎలాంటి తప్పు లేకుండా ఓటు వేసుకునేలా కరసత్తు ముమ్మరం చేసింది. రేపు సాయంత్రం 4గంటలకు పోలింగ్‌ ముగియగానే కౌంటింగ్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. సాయంత్రానికికల్లా ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది.

వైకాపా శాసనసభ్యుల్లో కొందరిపై నిఘా?

ప్రతి ఓటూ కీలకమైనందున అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరి కదలికలను ఇంటెలిజెన్స్‌ సిబ్బందితో పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ కష్టం అనే పరిస్థితి ఉన్నవారు, పార్టీ అదనపు సమన్వయకర్తలను నియమించిన నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీపై అసంతృప్తితో ఉన్నవారు, కొంతకాలంగా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండని వారు.. ఇలా పలు కారణాలతో కొందరిపై వైకాపా అధిష్ఠానం దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్‌, కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు, ఉమ్మడి విశాఖ, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్యే, ఇంకొందరు ఇంటెలిజెన్స్‌ పర్యవేక్షణలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని