Nara Lokesh: జగన్‌కు ఆనాడే చెప్పా.. తగ్గేదే లేదని..: నారా లోకేశ్‌

తమ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు.

Updated : 08 Mar 2024 16:13 IST

పుట్టపర్తి, కదిరి: తమ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి, కదిరిలో నిర్వహించిన ‘శంఖారావం’ సభల్లో ఆయన మాట్లాడారు. తెదేపా బలం కార్యకర్తలని.. నాయకులు పార్టీ మారి వెళ్లినా పార్టీకి అండగా నిలబడేది వారేనని అన్నారు. 

‘‘వైకాపా నాయకులు, కార్యకర్తలకు భూంభూం, ప్రెసిడెంట్‌ మెడల్‌ కావాలేమో.. తెదేపా కార్యకర్తలు మాత్రం పార్టీ అధ్యక్షుడి పిలుపు ‘రా.. కదలిరా’ అంటే తరలివస్తారు. 2014లో కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో చనిపోయిన ప్రతి కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షలు ఇస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికి రూ.100 కోట్లు ఖర్చు పెట్టాం. పలువురు కార్యకర్తల పిల్లల్ని నా తల్లి నారా భువనేశ్వరి దత్తత తీసుకుని చదివిస్తున్నారు. నాకు అక్కా చెల్లెళ్లు, అన్నదమ్ములు లేరు.. కానీ ఎన్టీఆర్‌ నాకు 60 లక్షల మంది అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములను ఇచ్చారు.

తెదేపా నేతలు, కార్యకర్తలపై 2019 నుంచి 2024 వరకు అనేక అక్రమ కేసులు పెట్టారు. నాపైనా 22 కేసులు నమోదు చేశారు. జగన్‌కు ఆనాడే చెప్పా తగ్గేదే లేదని. చట్టాలను ఉల్లంఘించిన అధికారుల పేర్లు, వైకాపా నాయకుల పేర్లు రెడ్‌బుక్‌లో ఉన్నాయి. మేం ప్రజాధనాన్ని లూటీ చేయలేదు, మాయమాటలు చెప్పి అధికారంలోకి రాలేదు, పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తులం కాదు. గతంలో చంద్రబాబును అరెస్టు చేస్తే మొదట ఫోన్‌ చేసిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌. ఆయన ఒక అన్నగా నిలబడతానని నాకు చెప్పారు. ఆరోజు విమానంలో రావాలంటే అతనికి అనుమతి ఇవ్వలేదు. రోడ్డు మార్గంలో వస్తే అడ్డుకున్నారు. వైకాపా అరాచకాలు, ప్రజలపై వేధింపులు చూసి తట్టుకోలేకే పవన్‌ తెదేపాతో కలిసి వైకాపాను ఓడించాలని నిర్ణయించుకున్నారు’’ అని లోకేశ్‌ అన్నారు. 

జగన్‌.. బీసీలకు ఏం చేశారు?

కదిరి సభలో లోకేశ్‌ మాట్లాడుతూ వైకాపా పాలనలో 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారని.. 300 మందిని హత్య చేశారని ఆరోపించారు. ‘‘ఐదేళ్లుగా బీసీలకు ఏం చేశారో జగన్‌ చెప్పాలి. వాళ్లకు రావాల్సిన 30 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు. బీసీ సబ్‌ప్లాన్‌ నిధులను వైకాపా ప్రభుత్వం పక్కదారి పట్టించింది. మేం అధికారంలోకి వచ్చాక బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. సబ్‌ప్లాన్‌ కింద ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు పెడతాం. ఆదరణ పథకం కింద రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టి పనిముట్లు అందిస్తాం’’ అని నారా లోకేశ్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని