Opposition Parties: విపక్షాల భేటీకి ముహూర్తం ఖరార్‌.. జూన్‌ 12న పట్నాలో సమావేశం!

కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలు ఒక చోట సమావేశమయ్యేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ భేటీలో 20 విపక్ష పార్టీలు పాల్గొననున్నట్లు సమాచారం. 

Published : 28 May 2023 18:09 IST

దిల్లీ: కేంద్రంలో ఎన్డీయే (NDA) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకమయ్యేందుకు విపక్ష పార్టీల (Opposition Parties) సమావేశానికి వేదిక ఖరారైంది. ఈ మేరకు విపక్ష పార్టీలు బిహార్‌ (Bihar) రాజధాని పట్నా (Patna)లో జూన్‌ 12న భేటీ కానున్నాయి. కాంగ్రెస్‌ (Congress), వామపక్ష పార్టీలతోపాటు తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC), ఆప్‌ (AAP) సహా 20 ప్రతిపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. ఈ భేటీకి 18 పార్టీల అధ్యక్షులు హాజరవుతారని సమాచారం. 2024 లోక్‌సభ ఎన్నికల (2024 Lok Sabha Elections) సన్నద్ధత భేటీగా ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. భాజపాను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. 

బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ గత కొంతకాలంగా జాతీయస్థాయిలో ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపై తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో గత వారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతోపాటు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విపక్షాల ఐక్యతకు అనుసరించాల్సిన వ్యూహంతోపాటు పట్నాలో సమావేశం ఏర్పాటు చేయడంపై వీరు చర్చించినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే జేడీయూ అధినేత, బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ ప్రతిపక్ష పార్టీల భేటీకి తేదీని నిర్ణయించినట్లు సమాచారం. అంతకముందు నీతీశ్‌ కుమార్‌ టీఎంసీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌తో భేటీ అయ్యారు.

మరోవైపు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు పలువురు విపక్ష పార్టీ నేతలను కలిసి వారి మద్దతును కోరారు. ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నీతీశ్‌ కుమార్‌, తేజస్వి యాదవ్‌, ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లాతోపాటు పలు విపక్ష నేతలు హాజరైన విషయం తెలిసిందే. దీని ద్వారా తాము ఐక్యంగా ఉన్నామని చెప్పే ప్రయత్నం విపక్ష పార్టీలు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే పలు ప్రతిపక్ష పార్టీలు నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి గైర్హాజరయ్యాయి. ఈ నేపథ్యంలో జూన్‌ 12న జరిగే భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆదివారం దిల్లీలోని పార్టీ జాతీయ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని