PM Modi: భారాస, కాంగ్రెస్‌ మధ్య తెలంగాణ నలిగిపోయింది: మోదీ

కేంద్రంలో భాజపా మూడోసారి గెలవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

Updated : 16 Mar 2024 14:56 IST

నాగర్‌కర్నూల్‌: కేంద్రంలో వరుసగా మూడోసారి భాజపా గెలవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. భారాస పట్ల ప్రజలు తమ కోపాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో చూపారని చెప్పారు. ‘‘పదేళ్లుగా తెలంగాణ ప్రజల కలలను భారాస, కాంగ్రెస్‌ చిదిమేశాయి. ఇన్నేళ్లు భారాస అవినీతికి పాల్పడితే ఇప్పుడు తమ వంతు వచ్చిందని కాంగ్రెస్‌ భావిస్తోంది. భారాస, కాంగ్రెస్‌ అనే రెండు విసుర్రాళ్ల మధ్య తెలంగాణ నలిగిపోయింది. రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు కాంగ్రెస్‌కు ఈ ఐదేళ్లు చాలు’’ అని ప్రధాని దుయ్యబట్టారు.

‘‘భాజపాను గెలిపించండి.. మీ ఆకాంక్షలను నేరవేరుస్తాం. మీ అభివృద్ధి కోసం నేను రాత్రి, పగలూ పనిచేస్తాను. నిన్న మల్కాజిగిరిలో ప్రజలు వీధుల్లో బారులు తీరి మద్దతు తెలిపారు. మా పార్టీ ఎంపీలను భారీ సంఖ్యలో గెలిపిస్తే అప్పుడు కాంగ్రెస్‌ ఆటలు సాగవు. ఆ పార్టీ ‘గరీబీ హఠావో’ అని దశాబ్దాల క్రితమే నినాదం ఇచ్చింది. కానీ పేదరికం పోయిందా? కాంగ్రెస్‌ పాలన అంతా మోసం, దోపిడీ మాత్రమే. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఓటు బ్యాంకుగానే చూసింది. భాజపాకు పూర్తి మెజారిటీ ఇచ్చిన తర్వాతే దేశంలో మార్పు మొదలైంది. మార్పునకు గ్యారంటీ.. మోదీ గ్యారంటీ మాత్రమే. నేను నా కోసం.. ఒక్కరోజు కూడా వినియోగించుకోలేదు. రేయింబవళ్లు 140 కోట్ల ప్రజల కోసమే పని చేస్తున్నాను. ఆర్టికల్‌ 370, అయోధ్య రామాలయం నిర్మాణం ఇందుకు కొన్ని ఉదాహరణలు’’ అని మోదీ తెలిపారు.

‘‘తెలంగాణలో ప్రజల కోసం కోటి బ్యాంకు ఖాతాలు తెరిచాం. కోటిన్నర మందికి బీమా కల్పించాం. 67 లక్షల మందికి ముద్రా రుణాలు అందించాం. 80 లక్షల మంది ఆయుష్మాన్‌ పథకం కింద లబ్ధి పొందారు. భాజపా పాలనలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, రైతులకే ఎక్కువ మేలు జరిగింది. కాంగ్రెస్‌ సామాజిక న్యాయం పేరుతో రాజకీయంగా పబ్బం గడుపుతోంది. గిరిజన మహిళ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించేందుకు ఆ పార్టీ ప్రయత్నించింది. యాదాద్రిలో చిన్న పీట వేసి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కూడా అవమానించింది. దళిత బంధు పేరిట కేసీఆర్‌ మోసం చేశారు. దళితుడినే తెలంగాణకు తొలి సీఎం చేస్తామని మాట తప్పారు. కొత్త రాజ్యాంగం అవసరమంటూ అంబేడ్కర్‌ను అవమానించారు’’ అని మోదీ విమర్శించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని