Jammu Kashmir: ప్రేమని కోరితే.. బుల్డోజర్లు వచ్చాయి: రాహుల్ గాంధీ

జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వం చేపట్టిన యాంటీ ఎంక్రోచ్‌మెంట్‌ డ్రైవ్‌పై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ప్రజలు కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను ప్రభుత్వం కూల్చేస్తోందని మండిపడ్డారు.  

Published : 12 Feb 2023 22:52 IST

దిల్లీ: జమ్ముకశ్మీర్‌(jammu kashmir)లో ఆక్రమణల తొలగింపు కోసం నిర్వహిస్తోన్న ప్రత్యేక డ్రైవ్‌ను ప్రధాన పార్టీలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయంపైనే కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ(rahul gandhi) ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న కశ్మీరీల ఇళ్లను భాజపా లాగేసుకుంటోందన్నారు.

‘‘జమ్ముకశ్మీర్‌ ప్రజలు ఉద్యోగావకాశాలను, వ్యాపారాభివృద్ధిని, ప్రేమను కోరుకుంటున్నారు. కానీ, వారి వద్దకు భాజపా బుల్డోజర్లు వస్తున్నాయి. ఇక స్థలాల విషయానికొస్తే.. ప్రజలు దశబ్దాలపాటు కష్టపడి ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్నారు. ఇప్పుడు వాటిని భాజపా దోచుకుంటోంది’’అని విమర్శించారు. విభజించడం ద్వారా కాదు.. కలిసికట్టుగా ఉన్నప్పుడే కశ్మీరీలకు రక్షణ లభిస్తుందని, శాంతి నెలకొంటుందని చెప్పారు.

జమ్ముకశ్మీర్‌లోని ఆక్రమణలను స్వాధీనం చేసుకోవాలన్న రెవెన్యూశాఖ ఆదేశాల మేరకు అధికారులు యాంటీ ఎంక్రోచ్‌మెంట్‌ డ్రైవ్‌ (anti-encroachment drive) చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు అధికారులు 10 లక్షల కనాల్స్‌ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రైవ్‌ను నిలిపివేయాలని కోరుతూ గత నెలలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కానీ, స్టే విధించేందుకు కోర్టు అంగీకరించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని