త్వరలో జిల్లా ఆసుపత్రులను సందర్శిస్తాం: భట్టి

కాంగ్రెస్‌ ప్రతినిధుల ఆధ్వర్యంలో దిల్లీ వెళ్లి నదీ జలాల సమస్యను వివరిస్తామని తెలంగాణ సీఎల్పీ నేత..

Published : 09 Aug 2020 23:09 IST

తెలంగాణ సీఎల్పీ సమావేశం నిర్వహణ

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రతినిధుల ఆధ్వర్యంలో దిల్లీ వెళ్లి నదీ జలాల సమస్యను వివరిస్తామని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. జూమ్‌ ఆప్‌ ద్వారా సీఎల్పీ సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ప్రజా సమస్యలు, కరోనా కట్టడి, ప్రభుత్వ వైఫల్యం, దళితులపై దాడులు, కృష్ణా నీళ్లు, ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 203, పోతిరెడ్డిపాడు విస్తరణ వంటి అంశాలపై చర్చించారు. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, పోడెం వీరయ్య, సీతక్క, రాజగోపాల్‌ రెడ్డి, శ్రీధర్‌ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బెల్ట్‌ షాపులను మూసేయాలన్నారు. లేనిపక్షంలో కాంగ్రెస్‌ భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణలో చాలా ప్రాజెక్టులకు ప్రమాదకరంగా మారిన  జీవో నెంబరు 203కి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టి, కేంద్ర శాఖ దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానం చేశామని చెప్పారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చేలా ప్రభుత్వం మీద ఒత్తిడి  పెంచాలని సీఎల్పీ సమావేశంలో నిర్ణయించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో హోంక్వారంటైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 

త్వరలోనే జిల్లా ఆసుపత్రులను సందర్శించాలని సమావేశంలో నిర్ణయించినట్లు భట్టి తెలిపారు. కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజల సహాయార్థం గాంధీభవన్‌లో హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి , రాష్ట్రపతి ని కలుస్తామని చెప్పారు.  పార్టీ ఫిరాయింపులతో పాటు , పార్టీ కార్యాలయాలను ఆక్రమించుకొనే తెరాస సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు