Bhatti vikramarka: చరిత్ర చెప్పుకుంటూ మోదీ, కేసీఆర్‌ బతికేస్తున్నారు: భట్టి

దేశానికి కాంగ్రెస్‌ పార్టీ తీసుకొచ్చిన స్వాతంత్ర్యాన్ని, ఆర్థిక పరిస్థితిని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చిన్నాభిన్నం చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు...

Published : 15 Aug 2021 15:30 IST

హైదరాబాద్‌: దేశానికి కాంగ్రెస్‌ పార్టీ తీసుకొచ్చిన స్వాతంత్ర్యాన్ని, ఆర్థిక పరిస్థితిని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చిన్నాభిన్నం చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. స్వాతంత్ర్య సమరయోధులు, కాంగ్రెస్ ఉద్యమనేతలు, మహనీయుల చరిత్రను తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు. దేశ ప్రజాస్వామ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. నేటి పాలకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, స్వేచ్ఛను హరిస్తున్నారని ధ్వజమెత్తారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, పేదరికంలో ఉన్న దళితుల కోసం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను కాంగ్రెస్‌ తీసుకొచ్చిందని భట్టి తెలిపారు. గడిచిన ఏడేళ్ళుగా తెరాస ప్రభుత్వం ఈ ఉప ప్రణాళికను సక్రమంగా అమలు చేయలేదని ఆరోపించారు. గతంలో ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయలేదని.. ఎన్నికల కోసమే ఈ పథకాన్ని అస్త్రంగా వాడుకొని వదిలేస్తారేమోననే సందేహాన్ని భట్టి వ్యక్తం చేశారు. సర్దార్ పటేల్ చరిత్ర చెప్పుకొని ప్రధాని మోదీ.. పీవీ నర్సింహారావు చరిత్ర చెప్పుకొని సీఎం కేసీఆర్ బతికే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దళిత బంధును ఒక్క హుజూరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అమలు చేయాలని భట్టి డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని