Siddaramaiah: అంతా అబద్ధం.. తమిళనాడుకు ఒక్క నీటిబొట్టునూ వదలం: సిద్ధరామయ్య

బెంగళూరులో నీటి సంక్షోభం నెలకొన్న వేళ కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేస్తున్నారంటూ భాజపా చేసిన ఆరోపణలను సీఎం సిద్ధరామయ్య కొట్టి పారేశారు. అవన్నీ అబద్ధాలేనన్నారు.

Published : 13 Mar 2024 00:49 IST

చామరాజనగర్‌: బెంగళూరు (Bengaluru) నగరంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న వేళ కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేస్తున్నట్లు ప్రతిపక్ష భాజపా (BJP) చేస్తోన్న ఆరోపణలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) స్పందించారు. అవన్నీ అబద్ధాలేనంటూ కొట్టిపారేశారు. తమ రాష్ట్రంలో నీటికొరత ఎదుర్కొంటున్న ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క నీటిబొట్టును కూడా తమిళనాడుకు ఇచ్చేది లేదని స్పష్టంచేశారు. చామరాజనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అదంతా అబద్ధం. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు నీళ్లు ఇస్తారు? మన వినియోగానికి నీటిని ఉంచుకోకుండా తమిళనాడుకు చుక్క నీరు కూడా ఇవ్వం. తమిళనాడు మమ్మల్ని అడగనప్పుడు మేం నీళ్లు ఎందుకు ఇస్తాం? వారికి ఇవ్వడానికి అసలు మన దగ్గర నీరు ఎక్కడ ఉంది? తమిళనాడు అడిగినా, కేంద్రం లేదా ఇంకెవరైనా నీరు విడుదల చేయాలని కోరినా వాళ్లకు ఇచ్చే ప్రశ్నే లేదు’’ అని సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. 

శరత్‌ కుమార్‌ కీలక నిర్ణయం.. భాజపాలో ఏఐఎస్‌ఎంకే విలీనం

కర్ణాటక రాజధాని బెంగళూరులో నీటి సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. వేసవి ప్రారంభంలోనే నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేస్తోందంటూ కర్ణాటకలో ప్రతిపక్ష నేత ఆర్‌.అశోక సోమవారం ఆరోపణలు చేశారు. తక్షణమే నీటి విడుదలను ఆపాలని డిమాండ్‌ చేశారు. ఆయన చేసిన ఆరోపణలపై తాజాగా స్పందించిన సిద్ధరామయ్య.. అవన్నీ అవాస్తవాలేనని.. అసలు తమిళనాడుకు ఇచ్చేందుకు నీళ్లు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని