Adimulam: ఎమ్మెల్యే టికెట్‌ రాకుండా కుట్ర చేసింది పెద్దిరెడ్డే: వైకాపా ఎమ్మెల్యే ఆదిమూలం

చిత్తూరు జిల్లా సత్యవేడు వైకాపా ఎమ్మెల్యే ఆదిమూలం సొంత పార్టీపైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో ఎస్సీలకు సరైన గౌరవం లేదని మండిపడ్డారు.

Updated : 28 Jan 2024 14:57 IST

సత్యవేడు: చిత్తూరు జిల్లా సత్యవేడు వైకాపా ఎమ్మెల్యే ఆదిమూలం సొంత పార్టీపైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో ఎస్సీలకు సరైన గౌరవం లేదని మండిపడ్డారు. సత్యవేడు నియోజకవర్గ ఆత్మీయ సమావేశాన్ని మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో నిర్వహిస్తారా? అని ప్రశ్నించారు. ‘‘ నాకు ఇష్టం లేకపోయినా తిరుపతి ఎంపీ స్థానం ఇన్‌ఛార్జిగా ప్రకటించారు. చెవిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, రోజా స్థానాల్లో ఇలా ప్రకటించగలరా?’’ అని నిలదీశారు. 

సత్యవేడులో మంత్రిపెద్దిరెడ్డి అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన ఆయన..  అక్రమాలన్నింటినీ తనపై నెట్టేసి.. నియోజకవర్గం నుంచి నన్ను తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ 1989లో మోటారు సైకిల్‌పై తిరిగిన పెద్దిరెడ్డి ఆస్తులు ఇప్పుడు ఎంత? మాజీ మంత్రి చెంగారెడ్డిని అడిగితే ఆయన అప్పటి ఆస్తుల గురించి చెబుతారు. నాకు ఎమ్మెల్యే టికెట్‌ రాకుండా చేసింది పెద్దిరెడ్డే. ఇటీవల సీఎం నన్ను పిలిపించారు. అన్నా.. మీరు ఎంపీగా పోటీ చేయాలన్నారు. నేనేం తప్పు చేశా. ఎంపీగా ఎందుకు పంపుతున్నారని అడిగా. ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వకపోవడానికి రెండు కారణాలు చెప్పాలని అడిగా’’ అని ఆదిమూలం అన్నారు.

 ‘‘రాష్ట్రంలోని  175 స్థానాల్లో సత్యవేడు ప్రశాంతంగా ఉంది. అధికార, విపక్ష నేతల్లో ఎవరిపైనా కేసులు నమోదు కాలేదు. ఎవరిపై ఫిర్యాదులు వచ్చినా డీఐజీతో చెప్పి రాజీ చేయించాను. నియోజకవర్గం ప్రశాంతంగా ఉండేందుకు పాటుపడ్డాను. నాకు ఇష్టం లేకపోయినా తిరుపతి ఎంపీగా వెళ్లాల్సిందే అన్నారు. రెండు నెలలుగా ఈ అంశంపై హింస పెట్టారు. ఎంతో బాధపడ్డాను’’ అని ఆదిమూలం మీడియా ఎదుట వాపోయారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని