ధోనీ దెబ్బకు పాక్‌ క్రికెటర్‌ ‘డేటింగ్‌’ రద్దు 

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ గతవారం రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ అతడి గురించి, అతడి కెప్టెన్సీ గురించి అనేక మంది ప్రశంసిస్తున్నారు...

Published : 23 Aug 2020 12:14 IST

టీమ్‌ఇండియాకు రాకముందే జరిగిన సంఘటన..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ గతవారం రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ అతడి గురించి, అతడి కెప్టెన్సీ గురించి అనేక మంది ప్రశంసిస్తున్నారు. తనదైన వ్యక్తిత్వం, ఆటతీరుతో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. అతడో గొప్ప ఆటగాడే కాకుండా, అత్యుత్తమ ఫినిషర్‌, కెప్టెన్‌ అని మెచ్చుకుంటున్నారు. అలాంటి ఆటగాడు.. అనుకోకుండా ఒక పాకిస్థాన్‌ క్రికెటర్‌ డేటింగ్‌ రద్దుకు కారణమయ్యాడు. అది కూడా అతడు టీమ్‌ఇండియా(జాతీయ జట్టు)కు ఎంపికవ్వకముందు. ఆ పాక్‌ క్రికెటర్‌ డేటింగ్‌కి వెళ్లాల్సింది ఓ భారత యువతితో.

ధోనీ 2005లో జాతీయ జట్టుకు ఎంపికవ్వకముందు ఇండియా ఏ టీమ్‌లో ఆడాడు. అప్పుడు కెన్యాలో పాకిస్థాన్ ఏ, భారత్‌ ఏ జట్లతో నిర్వహించిన ట్రై సిరీస్‌లో రెచ్చిపోయి ఆడి 360 పరుగులు చేశాడు. దాంతో సెలక్టర్ల దృష్టిలో పడి టీమ్‌ఇండియాకు ఎంపికయ్యాడు. ఇది పక్కన పెడితే.. ఆ ట్రై సిరీస్‌లోనే పాకిస్థాన్‌తో ఆడిన ఓ మ్యాచ్‌లో మహీ సిక్సుల వర్షం కురిపించాడు. అదే సమయంలో లాంగ్‌ ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఓ పాకిస్థాన్‌ క్రికెటర్‌.. ఆ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన ఓ భారత్‌ యువతిని పరిచయం చేసుకున్నాడు. అదే రోజు మ్యాచ్‌ అయ్యాక ఆ యువతితో రెస్టారెంట్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఆమె కూడా అంగీకరించడం విశేషం. అయితే, ధోనీ కొట్టిన ఓ భారీ సిక్సర్‌ నేరుగా వెళ్లి ఆమెకు తగిలింది. దీంతో ఆ యువతికి గాయపడి ఆస్పత్రి పాలైంది. చివరికి ఆ పాకిస్థాన్‌ క్రికెటర్‌ ఆశలు అడియాశలయ్యాయి. ఇది మహీ కావాలని చేయకపోయినా.. అనుకోకుండా జరిగిపోయిందని క్రిక్‌బజ్‌ ఓ కథనంలో పేర్కొంది. 

ఆ సిరీస్‌ తర్వాత ధోనీ టీమ్‌ఇండియాకు ఎంపికయ్యాడు. తొలి మ్యాచ్‌ బంగ్లాదేశ్‌తో ఆడగా పరుగులేమీ చేయకుండానే రనౌటయ్యాడు. అనంతరం పాకిస్థాన్‌తో ఆడిన వైజాగ్‌ వన్డేలో తనలోని అసలైన క్రికెటర్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ మ్యాచ్‌లో 148 పరుగులు బాదగా తర్వాత శ్రీలంకపై 183 పరుగులు చేశాడు. ఆ తర్వాత ధోనీ వెనుతిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. ఇక 2007 నుంచీ 2017 వరకు పదేళ్లపాటు జట్టు సారథిగా కొనసాగడమే కాకుండా మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న ఏకైక కెప్టెన్‌గా చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని